Monday, April 29, 2024

అమిత్ షాతో కేసీఆర్ చర్చించిన అంశాలేంటి?

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సీఎం కేసీఆర్ శనివారం మ‌ధ్యాహ్నం అమిత్ షాను క‌లిశారు. రాష్ట్రానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఖ్యను పెంచాల‌ని, విభ‌జ‌న హామీల‌ను నెర‌వేర్చాల‌ని ఆయ‌న అమిత్ షాను కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన రెండేళ్ల త‌ర్వాత జిల్లాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ జ‌రిగింద‌ని, దాంతో కొత్త జిల్లాలు, కొత్త జోన్లు, కొత్త మ‌ల్టీజోన్లు ఏర్ప‌డ్డాయ‌ని, దానికి త‌గిన‌ట్లే పోలీసు శాఖ‌లోనూ మార్పులు జ‌రిగాయ‌న్నారు. అయితే పోలీసు శాఖ‌లో ఐపీఎస్ ఆఫీస‌ర్ల సంఖ్య‌ను పెంచాల‌ని ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రిని కోరారు. పోలీసు శాఖ‌లో జ‌రిగిన మార్పుల వ‌ల్ల సీనియ‌ర్ డ్యూటీ పోస్టుల సంఖ్య 75 నుంచి 105కు పెరిగింద‌ని, ఇక ఐపీఎస్ కేడ‌ర్ పోస్టుల సంఖ్య కూడా 139 నుంచి 195కు పెరిగాయ‌ని సీఎం కేసీఆర్ ఓ లేఖ‌లో కేంద్ర హోంశాఖ మంత్రికి తెలిపారు.

ఈ నేప‌థ్యంలో ప‌టిష్ట‌మైన పోలీసు వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేసేందుకు, ప‌రిపాల‌నా నిర్వ‌హ‌ణ‌కు అనుగుణ‌మైన రీతిలో ఐపీఎస్‌ల సంఖ్య‌ను పెంచాల‌ని సీఎం కేసీఆర్ కోరారు. పోలీసు ఆఫీస‌ర్ల‌కు సంబంధించిన అంశాన్ని కేంద్ర హోంశాఖ‌కు తెలియ‌జేశాన‌ని, కొత్త క‌మిష‌న‌ర్లు, డీఐజీలు, ఎస్పీలు, ఐజీపీల అవ‌స‌రం ఉంద‌ని సీఎం తెలిపారు. రాష్ట్ర ప్ర‌భుత్వ అవ‌స‌రాన్ని ప్ర‌త్యేక కేసుగా ప‌రిగ‌ణించి, ఐపీఎస్ క్యాడ‌ర్ స‌మీక్ష నిర్వ‌హించాల‌ని, త‌ద్వారా అవ‌స‌ర‌మైన ఆఫీస‌ర్ల‌ను కేటాయించాల‌ని సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రికి విజ్ఞ‌ప్తి చేశారు. కొత్తగా 29 సీనియర్ డ్యూటీ పోస్టులతో పాటుగా మొత్తం 195 ఐపీఎస్ పోస్టులు మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరారు.మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణాల‌కు నిధులు పెంచాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

కాగా, ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేసీఆర్ ఇప్ప‌టికే ప్ర‌ధాని మోడీతో 50నిమిషాల పాటు భేటీ అయిన సంగతి తెలిసిందే. ఆదివారం కేసీఆర్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చే అవ‌కాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement