Saturday, May 4, 2024

CM KCR: ఏపీది గొంతమ్మ కోరికలు.. రాజీపడే ప్రసక్తే లేదు

ఈనెల 12వ తేదీన“మినిస్టర్ ఆఫ్ హోం అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఛీఫ్ సెక్రటరీల సమావేశంలో అనుసరించాల్సిన విధి విధానాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పలు కీలక సూచనలు ఆదేశాలిచ్చారు. తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర పునర్విభజన చట్టానికి నూటికి నూరు శాతం కట్టుబడి ఉందన్న విషయాన్ని సమావేశంలో స్పష్టం చేయాలని సీఎస్ ను ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… విభజన చట్టంలోని అంశాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి వుంటేనే సహకరించాలని, లేదంటే గతంలో తీసుకున్న నిర్ణయాల్లో ఎలాంటి మార్పులు ఉండరాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలపై రాజీపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవసరం లేని వివాదాలు సృష్టిస్తూ.. విభజన చట్టంలో లేని అంశాలను కావాలని ముందుకు తెస్తుందని అన్నారు.  విభజన చట్టానికి వ్యతిరేకంగా.. సింగరేణి లాంటి సంస్థలలో వాటా కావాలని గొంతమ్మ కోరికలు కోరడం మూలంగానే ఇప్పటికే పరిష్కారం కావల్సిన అనేక అంశాలు, ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయని సిఎం కెసిఆర్ కు అధికారులు వివరించారు. ఈ నేపథ్యంలో విభజన చట్టంలోని షెడ్యూళ్లు 9, 10 లోని అంశాలపై గతంలో అనుసరించిన విధంగానే ముందుకు పోవాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

కాగా.. జనవరి 12 నాటికి కరోనా పెరుగుదలను దృష్టిలో ఉంచుకుని అప్పటి పరిస్థితులకు అనుగుణంగా సమావేశంపై నిర్ణయం తీసుకుంటామని సిఎం కెసిఆర్ తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement