Saturday, May 18, 2024

Mumbai – బంగారం స్మ‌గుల్డ్ చేస్తూ చిక్కిన అఫ్ఘ‌న్ దౌత్య‌వేత్త

ముంబై – అత్యున్నత పదవిలో ఉన్న ఓ అధికారిణి బంగారం స్మగ్లింగ్ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయారు. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.18.6 కోట్ల విలువైన 25 కేజీల బంగారాన్ని అక్రమంగా విదేశాల నుంచి భారత్‌కు తీసుకొచ్చి వార్తల్లో నిలిచారు. ఆ అధికారిణి ఎవరో కాదు భారత్‌లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్ కాన్సుల్ జనరల్ జకియా వార్దక్ .

వార్దక్‌ ఏప్రిల్‌ 25వ తేదీ సాయంత్రం 5:45 గంటల సమయంలో ఎమిరేట్స్‌ ఫ్లైట్‌లో కుమారుడితో కలిసి దుబాయ్‌ నుంచి భారత్‌ వచ్చారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ అవ్వగానే ఆమె గ్రీన్‌ ఛానెల్‌ ద్వారా ఎయిర్‌పోర్ట్‌ బయటకు వచ్చారు. అయితే, వార్దక్‌ బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ కు ముందుగానే సమాచారం అందింది.

- Advertisement -

దీంతో వారు అలర్ట్‌ అయ్యి ఎయిర్‌పోర్ట్‌లో సిబ్బందిని మోహరించారు. కానీ, దౌత్యవేత్త కావడంతో ఆమెకు తనిఖీల నుంచి మినహాయింపు ఇచ్చారు. అయితే, ఎయిర్‌పోర్ట్‌ ఎగ్జిట్‌ వద్ద డీఆర్‌ఐ అధికారులు ఆమెను అడ్డుకుని స్మగ్లింగ్‌ గురించి ఆరా తీశారు. బంగారం ఇతర వస్తువులేవైనా తీసుకెళ్తున్నారా అని ఆమెను ప్రశ్నించారు. అందుకు ఆమె అలాంటివేమీ తమ వద్ద లేవని సమాధానం చెప్పారు. దీంతో అధికారులు వార్దక్‌ను ఓ గదిలోకి తీసుకెళ్లి మహిళా అధికారులతో తనిఖీలు చేయించగా.. ఆమె బండారం మొత్తం బయటపడింది.

ఈ తనిఖీల్లో ఆమె ధరించిన జాకెట్‌, లెగ్గిన్‌, మోకాలి క్యాప్‌లో ఏకంగా 25 బంగారు కడ్డీలు బయటపడ్డాయి. ఆమె కుమారుడి వద్ద మాత్రం ఎలాంటి బంగారం కనిపించలేదు. దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్‌ చేయడం చూసి అధికారులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ బంగారానికి సంబంధించి సరైన పత్రాలు చూపించాల్సిందిగా వార్దక్‌ను డీఆర్‌ఐ అధికారులు అడగ్గా.. ఆమె చూపించలేకపోయింది. దీంతో ఆ బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆఫ్ఘాన్‌ దౌత్యవేత్తపై కస్టమ్స్‌ చట్టం, 1962 కింద బంగారం స్మగ్లింగ్‌ కేసు నమోదు చేశారు. కానీ, వార్దాక్‌కు దౌత్యపరమైన రక్షణ ఉండటంతో ఆమెను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా వదిలేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement