Saturday, April 27, 2024

ఏపీలో వ్యాక్సిన్ కొరత.. ప్రధాని మోదీకి జగన్ లేఖ!

కరోనా వ్యాక్సిన్ ల విషంలో ప్రధాని మోదీకి  లేఖలు వెల్లువెత్తుతున్నాయి. ఏపీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది.  కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.   రాష్ట్రంలో పెద్ద ఎత్తున టీకాలు వేస్తున్నారు. అయితే, టీకాల విషయంలో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 11 నుంచి 14 వరకు నాలుగు రోజులపాటు టీకా ఉత్సవ్ ను నిర్వహించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఉత్సవ్ లో భాగంగా రోజుకు ఆరు లక్షల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ లేఖ రాశారు. ‘టీకా ఉత్సవం’ కోసం వెంటనే 25 లక్షల కోవిడ్‌ డోస్‌లు పంపించాలని ప్రధానమంత్రిని ఈ లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. వేగంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్‌కు సంబంధించి టెస్ట్, ట్రాక్, ట్రేస్‌ నిర్దిష్ట పద్ధతిలో జరగాలన్న కేంద్రం సూచనలను రాష్ట్రంలో పక్కాగా అనుసరిస్తున్నామని తెలిపారు. కోవిడ్‌ నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలతో పాటు, వాక్సినేషన్‌ ప్రక్రియను రాష్ట్రంలో ఏ లోటూ లేకుండా అమలు చేస్తున్నామని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 11 నుంచి 14వ తేదీ వరకు ప్రత్యేకంగా ‘టీకా ఉత్సవం’ నిర్వహించాలన్న కేంద్ర నిర్దేశం ఈ ప్రక్రియలో ఎంతో ఉపయోగకరమన్నారు.

దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం సాగుతోందని లేఖలో గుర్తు చేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా టీకా పంపిణీ చేస్తున్నామన్నారు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) పరిధిలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డులో టీకా ఉత్సవం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించామని.. టీకా ఉత్సవంలో ప్రతి రోజూ 1140 పీహెచ్‌సీలు, 259 పట్టణ ఆరోగ్య కేంద్రాల (యూహెచ్‌సీ) పరిధిలోని 1145 గ్రామాలు, 259 వార్డులలో వాక్సిన్‌ వేస్తామని వెల్లడించారు.  టీకా ఉత్సవంలో ప్రతి రోజూ 6 లక్షల మందికి వాక్సిన్‌ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేశామని… రాష్ట్రంలో ప్రసుత్తం  కేవలం 2 లక్షల కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు మాత్రమే ఉండగా, మరో రెండు లక్షల డోస్‌లు  వచ్చే వీలుందని పేర్కొన్నారు.  రాష్ట్రానికి అత్యవసరంగా మరో 25 లక్షల కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌ల అవసరమని తెలిపారు.  ఈనెల 11వ తేదీ నాటికి అందిస్తే, ఈ కార్యక్రమాన్ని దేశమంతా గుర్తించే విధంగా నిర్వహిస్తామని.. తక్షణమే రాష్ట్రానికి 25 లక్షల కోవిడ్‌ వాక్సిన్‌ డోస్‌లు పంపేలా ఆరోగ్య శాఖను ఆదేశించాలని ప్రధాని మోడీ కోరారు సీఎం జగన్‌. 

కాగా, దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. అయితే, అందుకు సరిపడ వ్యాక్సిన్ మాత్రం అందుబాటులో లేదు. ఏపీ విషయానికి వస్తే ప్రస్తుతం దాదాపు 2 లక్షల వ్యాక్సిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో వ్యాక్సిన్ నిండుకునే ప్రమాదం ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. ఈ విషయమై ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. తమ రాష్ట్రానికి అత్యవసరంగా వ్యాక్సిన్ పంపాలని కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాసిన కాసేపటికే.. ఏపీ సీఎం జగన్ సైతం ప్రధాని మోదీకి లేఖ రాశారు. వ్యాక్సిన్ ల అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సైతం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. టీకా మహోత్సవం చేయడం కాదని.. అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ చేయాలని.. విదేశాలకు ఎగుమతి ఆపేయాలంటూ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement