Friday, April 26, 2024

ఉద్యోగుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్.. వారానికి నాలుగు రోజులే ప‌ని దినాలు

వారానికి నాలుగు రోజులు ప‌నిచేస్తే చాల‌ని త‌మ ఉద్యోగుల‌కు ఆఫ‌ర్ ఇచ్చాయి యునైటెడ్ కింగ్ డ‌మ్ లోని వంద కంపెనీలు. అదికూడా జీతంలో ఎలాంటి కోత పెట్టకుండా, పని గంటలను సర్దుబాటు చేయకుండా.. నాలుగంటే నాలుగు రోజులు మాత్రమే పనిచేయాలని సూచించాయి. ఈ కొత్త విధానాన్ని కంపెనీలో శాశ్వత ప్రాతిపదికన అమలు చేయాలని నిర్ణయించాయి. దీనివల్ల ఉద్యోగులు సంతోషంగా ఉన్నారని, కంపెనీ ఉత్పాదకతలో మార్పులేదని వెల్లడించాయి. నాలుగు రోజుల పని విధానాన్ని అమలు చేస్తున్న వంద కంపెనీల్లో రెండు ప్రముఖ కంపెనీలు కూడా ఉన్నాయని ‘ది గార్డియన్’ ఓ కథనాన్ని ప్రచురించింది. అవి.. ఆటమ్ బ్యాంక్, గ్లోబల్ మార్కెటింగ్ కంపెనీ అవిన్. ఒక్కో కంపెనీలో సుమారు 450 మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ పనితీరు ఎలా ఉందనేది అవిన్ సీఈవో ఆడమ్ రాస్ వెల్లడించారు.

ఉద్యోగుల పనివేళలను నిజాయతీగానే తగ్గించినట్లు రాస్ చెప్పారు. ఐదు రోజుల పనిగంటలను కుదించి నాలుగు రోజులకు సర్దుబాటు చేయలేదని వివరించారు. ఈ కొత్త పాలసీని అమలు చేశాక కంపెనీ ఉత్పాదకత కొంచెం కూడా తగ్గలేదని తెలిపారు. తమ ఉద్యోగులు సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నారని, నిపుణులైన ఉద్యోగులు సంస్థలోనే కొనసాగుతున్నారని చెప్పుకొచ్చారు. ఉద్యోగుల వలసలను ఇది అడ్డుకుంటుందని వివరించారు. కాగా, యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జి, ఆక్స్ ఫర్డ్, బోస్టన్ యూనివర్సిటీ లకు చెందిన పరిశోధకులు సుమారు 3300 మంది ఉద్యోగులు ఉన్న 70 కంపెనీలలో ఈ కొత్త విధానాన్ని అమలు చేస్తూ, ఫలితాలను పరిశీలిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement