Tuesday, May 7, 2024

పద్మభూషణ్ పురస్కరాన్ని తిరస్కరించిన బుద్ధదేవ్ భట్టాచార్య

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మభూషణ్ పురస్కరాన్ని తిరస్కరిస్తున్నట్టు సీపీఎం సీనియర్ నేత, పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ప్రకటించారు. ఈ అవార్డు గురించి తనకు ఎవరూ చెప్పలేదని, ఒకవేళ నిజంగానే తనను పద్మభూషణ్ పురస్కారానికి ఎంపిక చేసినట్టు అయితే దానిని తాను తిరస్కరిస్తున్నట్టు చెప్పారు.

మరోవైపు కేంద్ర హోంశాఖ కార్యదర్శి నిన్న ఉదయం ఈ అవార్డు విషయమై భట్టాచార్య భార్యతో మాట్లాడినట్టు కేంద్రం తెలిపింది. ఇందుకు ఆమె అంగీకరించారని, పౌరపురస్కారానికి ఎంపిక చేసినందుకు హోంమంత్రిత్వ శాఖకు ధన్యవాదాలు కూడా తెలిపారని పేర్కొంది.

కాగా, కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి ప్రకటించిన ‘పద్మ’ పురస్కారాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, బుద్ధదేవ్ భట్టాచార్యతోపాటు పలువురు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారిని కేంద్రం ఇలా ప్రతిష్ఠాత్మక పౌర పురస్కారాలతో సత్కరిస్తుంది. ఈసారి నలుగురిని పద్మవిభూషణ్, 17 మందిని పద్మభూషణ్, 107 మందిని పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement