Friday, May 3, 2024

Breaking: ల‌చ్చిందేవి అల‌క‌బూనిందే త‌ల్లి.. అచ్చం విక్రమార్కుడి స్టైల్ లోనే.. ఏంచేశారంటే..

విక్రమార్కుడు సినిమాలో లచ్చిందేవి పేరు చెప్పి హీరో రవితేజ మహిళలను మోసం చేసినట్టే.. సేమ్ టూ సేమ్ ఇక్కడ కూడా జరిగింది. అక్కడ హీరో అరగుండు కొట్టి వెళ్లిపోతే.. ఇక్కడ మాత్రం మోసగాళ్లు మరో విధంగా మహిళను బోల్తా కొట్టించారు. ఈ ఘటన హర్యానాలోని పానిపట్‌లో జరిగింది.

పానిపట్‌కు చెందిన‌ ముక్తా అనే మహిళ.. సోమవారం రాత్రి ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్‌కు చూపించుకుని మందులు కొనేందుకు మరో ఏరియాకు వెళ్తుంటే.. చీకట్లో ఓ ఇద్దరు ఆమెకు కనిపించారు. అందులో ఒకడు తనను తాను పండితుడిగా ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఆమె న‌మ్మేలా మాయమాటలు చెప్పాడు. తన మాటలు నమ్ముతోందని గ్రహించాడు.

లక్ష్మీదేవి నీపై కోపంగా ఉందే త‌ల్లి.. అని ఆమెకు చెప్పాడు. దీంతో ఆ మ‌హిళ‌ టెన్షన్ పడిపోయింది. కోపం పోవాలంటే ఏం చేయాలని వారిని అడిగింది. త‌ను పూర్తిగా తమ మాటలను నమ్మినట్టు గుర్తించిన ఆ ఇద్దరు ముందుగా ఆమె దగ్గరన్న బంగారు నగలు, డబ్బు తమకు ఇవ్వాలని కోరారు. ఆ త‌ర్వాత‌ 81 అడుగులు ముందుకు వెళ్లాలని, మళ్లీ వెనక్కి రావాలని కోరారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి కోపం తగ్గుతుందని నమ్మించారు.

ఇందుకు సంబంధించి ఆమెకు కొన్ని మాయమాటలు చెప్పారు. వారి మాటలు విన్న ఆ మహిళ.. తన దగ్గరున్న నగలు, పర్సు వారికి ఇచ్చి 81 అడుగులు ముందుకు వెళ్లింది. ఆ త‌ర్వాత‌ మళ్లీ వెనక్కి తిరిగొచ్చింది. అయితే ఆమె తిరిగొచ్చేసరికి అక్కడ ఆ ఇద్దరు కనిపించలేదు. వారి కోసం చుట్టుపక్కల వెతికింది.

కొద్దిసేపటి తరువాత గానీ తాను మోసపోయాననే విషయం ఆమెకు అర్థంకాలేదు. వెంటనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఆ ఇద్దరు మోస‌గాళ్ల‌పై కంప్లేంట్‌ చేసింది. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు ఇదంతా ఆమె గురించి తెలిసినవాళ్లు చేసిన పనే అయి ఉంటుంద‌ని అనుమానం వ్యక్తం చేశారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలించి.. నిందితులను పట్టుకోవడంపై దృష్టిపెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement