హైదరాబాద్లో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ గేమింగ్, పెట్టుబడుల పేరుతో కొంతమంది కేటుగాళ్లు భారీ చీటింగ్కు పాల్పడ్డారు. రూ.2,200 కోట్లకుపైగా మోసం జరిగినట్లుగా రిజిస్ట్రర్
ఆఫ్ కంపెనీ (ఆర్వోసీ) గుర్తించింది. పలు బోగస్ కంపెనీలపై హైదరాబాద్లోని సిటీ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) లో ఫిర్యాదు చేసింది. నకిలీ ధృవపత్రాలు, ఫోర్జరీ సంతకాలతో బోగస్ కంపెనీలను నిర్వహించినట్లు తెలిపింది. బోగస్ కంపెనీల డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రమోటర్లపై ఫిర్యాదు చేయడంతో పాటు వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. ఇక, కేటుగాళ్లు ఆన్లైన్ గేమింగ్, పెట్టుడుల యాప్ల పేరుతో నగదును తరలించినట్టుగా తెలిసింది. బోగస్ కంపెనీలు దాదాపు రూ.2వేల కోట్లకుపైగా తరలించినట్లు సమాచారం. డబ్బులను హాంకాంగ్కు తరలించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
మాల్ 008, మాల్ 98, వైఎస్ 01 23, మాల్ రిబేర్ డాట్ కమ్ పేర్లతో చైనీయులు ఈ మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. పెట్టుబడి పేరుతో డబ్బులు వసూలు చేసి మోసాలకు పాల్పడ్డ ఇద్దరు చైనీయులు కీలకపాత్ర పోషించినట్లుగా పోలీసులు గుర్తించారు. వారిని పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే చైనీయులకు బోగస్ కంపెనీలను సమకూర్చిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. హవాలా మార్గంలో డబ్బు రవాణా అయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..