Monday, May 13, 2024

మిర్చి రైతులను ఆదుకోకుంటే ఉద్యమం: భట్టి హెచ్చరిక

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తీవ్రంగా ఫైర్ అయ్యారు. పత్తి పంటను గులాబీ పురుగు, మిర్చి పంటను తామర పురుగు పీల్చిపిప్పి చేసినట్టే, కేంద్రంలోని తామర పువ్వు బిజెపి పార్టీ, రాష్ట్రంలోని గులాబీ రంగు పార్టీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు ప్రజలను పీల్చిపిప్పి చేసి ఆర్థిక సంపదను కొల్లగొడుతున్నాయని మండిపడ్డారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరులో తామర చీడ సోకి దెబ్బతిన్న మిర్చి పంటపొలాలను గురువారం ఆయన పరిశీలించారు. రైతులను అడిగి వివరాలు  తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాష్ట్రంలో లక్షల ఎకరాల మిర్చి తోటలను తామర పురుగు చేస్తున్న వినాశనాన్ని విపత్తుగా గుర్తించి నియంత్రణ చర్యలు చేపట్టాల్సిన టిఆర్ఎస్ ప్రభుత్వం మొద్దు నిద్రపోతోందని ధ్వజమెత్తారు. వ్యవసాయ శాఖ ఉద్యాన శాఖ అధికారులను, శాస్త్రవేత్తలను క్షేత్ర స్థాయికి పంపించి నష్ట నివారణ చర్యలు చేపట్టడంపై స్పందించకుండా ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లో పడుకొని, వ్యవసాయ మంత్రి ఇంట్లో పడుకుంటే రైతుల ఆందోళనను తీర్చాల్సింది ఎవరని ప్రశ్నించారు.

రాష్ట్రవ్యాప్తంగా మిర్చి తోటలు తామర పురుగు సోకి దెబ్బతినడం వెనక నకిలీ విత్తనాలు కారణమై ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగాన్ని ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పడం కుట్రలో భాగంగానే తామర పురుగును మిర్చి తోటలపై వదిలి ఉంటా రని ఆరోపించారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం మొద్దునిద్ర గా వ్యవహరిస్తున్నదని విమర్శించారు.

వరి వేస్తే ఉరి అని ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని, ప్రకటించిన సీఎం కెసిఆర్ రాష్ట్రంలో పత్తి, మిర్చి సాగు చేసి నష్టపోతున్న రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం సిగ్గుచేటన్నారు. అన్నదాతలు పిట్టల్లా రాలిపోతున్న పట్టించుకోని టిఆర్ఎస్ సర్కారు రాష్ట్రంలో ఉన్నట్టా? లేనట్టా ? అని నిలదీశారు. బిజెపి టిఆర్ఎస్ ప్రభుత్వాలు ఆడుతున్న రాక్షస క్రీడలో తెలంగాణ రైతులు బలవుతున్నారని మండిపడ్డారు. మొద్దు నిద్రపోతున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మెడలు వంచుతామని, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకోవద్దని, చావు సమస్యకు పరిష్కారం కాదని, ప్రభుత్వాలపై పోరాడి హక్కులను సాధించుకుందామని రైతులకు పిలుపునిచ్చారు. రైతు సమస్యలపై రచ్చబండ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతులతో కలిసి ప్రభుత్వంపై ఉద్యమిస్తుందని భట్టి హెచ్చరించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement