Wednesday, May 8, 2024

గ్రీన్ చానల్ తో సకాలంలో ఆక్సిజన్ సరఫరా

కరోనా రోగులకు కీలకంగా మారిన ఆక్సిజన్‌ ను గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసి పోలీసులు సకాలంలో తెప్పించారు. గుంటూరు జీజీహెచ్ లో ఆక్సిజన్ కొరత ఏర్పడిన నేపథ్యంలో వైజాగ్ నుంచి తరలిస్తున్నారు. గుంటూరు జీజీహెచ్‌ లో 800 పడకల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరితో పాటు సాధారణ రోగులు కూడా ఇక్కడ వందల సంఖ్యలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రికి విశాఖపట్నం నుంచి ఆక్సిజన్‌ సరఫరా అవుతుంటుంది. ఈ క్రమంలో ఆదివారం ఉదయం విశాఖపట్నం నుంచి 10 కిలోలీటర్ల సామర్థ్యం కలిగిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ బయల్దేరింది. ఇది సాయంత్రం నాలుగు గంటలకు గుంటూరు చేరుకోవాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆక్సిజన్‌ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని జీజీహెచ్‌ వైద్యులు గుర్తించారు. దీంతో వైద్య అధికారులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.

వెంటనే స్పందించిన డీఐజీ త్రివిక్రమ వర్మ, ఎస్పీ ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి.. పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ, విజయవాడ కమిషనర్‌ శ్రీనివాసులును, స్టేట్‌ కోవిడ్‌–19 కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారులను అప్రమత్తం చేశారు. ఆక్సిజన్‌ ట్యాంకర్‌ తో వస్తున్న లారీకి ఎక్కడ ట్రాఫిక్‌ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా హైవే పెట్రోలింగ్, పోలీస్‌ వాహనాలను పైలెట్‌ గా ఉంచి గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేశారు. దీంతో ఆక్సిజన్‌ ట్యాంకర్‌ చేరుకోవాల్సిన సమయం కంటే గంటన్నర ముందు అంటే మధ్యాహ్నం 2.20 గంటలకే గుంటూరు జీజీహెచ్‌కు చేరుకుంది. దీంతో వైద్యులు ఊపిరి పీల్చుకున్నారు. దీంతో రోగులకు సకాలంలో వైద్యం అందింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement