Tuesday, May 14, 2024

జూబ్లీహిల్స్ ప‌బ్ కేసులో మ‌రో ట్విస్ట్‌.. బాలిక‌పై రేప్, నిందితుల్లో ప్ర‌జాప్ర‌తినిధుల కుమారులు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పరిధిలో ఓ పబ్‌కు వచ్చిన బాలిక(17)పై లైంగిక దాడి కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ ఘటనలో అత్యాచారం జరిగినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు. నిందితుల్లో ప్రజాప్రతినిధుల కుమారులున్నట్లు తెలుస్తోంది. ఇంటి వద్ద దింపుతామని నమ్మించి బాలికను కారులో కొంతమంది యువకులు తీసుకెళ్లారు. బాలిక మెడపై గాయాలు గమనించిన తల్లిదండ్రులు ఆరా తీయగా ఆమెతో కొందరు యువకులు అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపింది. ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసులు పెట్టారు.

జూబ్లీహిల్స్ పబ్ బాలిక కిడ్నాప్ కేసులో ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు తెలిశాయి. బాలికపై లైంగిక దాడి జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోక్సో సెక్షన్ కిందా జూబ్లీహిల్స్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బాలిక తండ్రి సీల్డ్ కవర్లో పోలీసులకు వివ‌రాలు అందించారు. గత నెల 28న జూబ్లీహిల్స్ అమ్నేషియా పబ్ కు పార్టీకి వెళ్లిందని పేర్కొన్నారు. ఆమెను రెడ్ కలర్ మెర్సిడెజ్ బెంచ్ తీసుకెళ్లినట్లు, ఆ కారును ఇన్నోవా కారు వెంబడించిందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. TS 09 FL 6460 నెంబర్ మెర్సిడెజ్ బెంచ్ కారు బాలిక బలవంతంగా తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిపారు. తన కూతురి పట్ల అసభ్యంగా ప్రవర్తించి మెడపై గాయం చేశారని బాలిక తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి తమ కూతురు షాక్ లో ఉందని ఆయన తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement