Sunday, April 28, 2024

నిఘా నీడ‌లో ప్ర‌వేశ ప‌రీక్ష‌లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీ-ఎస్‌పీఎస్సీ, పదో తరగతి పేపర్‌ లీకేజీల నేపథ్యంలో ఈ నెల నుంచి జరగనున్న వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎంసెట్‌, ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఐసెట్‌, పీజీ ఈసెట్‌, పీఈసెట్‌, ఈసెట్‌ పరీక్షల నిర్వహణపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. ఈమేరకు
పరీక్షా కేంద్రాల్లో గట్టి నిఘాను ఏర్పాటు చేయనుంది. పేపర్‌ లీకేజీలు, ప్రశ్నపత్రాలు బయటికి రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే పరీక్షాకేంద్రాల్లో పూర్తిస్థాయి సిట్టింగ్‌ స్క్వాడ్‌ను (అబ్జర్వర్‌) నియమించాలని నిర్ణయించింది. ప్రతి పరీక్షా కేంద్రాల్లో ఒకరు చొప్పన సిట్టింగ్‌ స్క్వాడ్‌ను నియమించనుంది. వీరు పరీక్ష పూర్తయ్యే వరకు పరీక్షా కేంద్రాలపై గట్టి నిఘాను పెడతారు. గతంలో ప్లnయింగ్‌ స్క్వాడ్‌ను నియమించేవారు. అయితే వీరు అడపాదడపా తనిఖీలు మాత్రమే నిర్వహించేవారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి అన్ని రకాల పరీక్షలు నిర్వహించి పరీక్షా కేంద్రంల్లో అబ్జర్వర్‌లను నియమిస్తారు. అంతేకాకుండా ఇక ప్రతీ పరీక్షా కేంద్రం వద్ద నలుగురు పోలీసుల బందోబస్తుతోపాటు, కేంద్రాల్లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు- చేయనున్నారు. పరీక్షలు జరిగే సమయంలో ప్రశ్నపత్రాలు వాట్సాప్‌ల్లో చక్కర్లు కొడుతుండటంతో ఇక సెల్‌ఫోన్లను పరీక్షా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో నిషేదించారు. పరీక్షా కేంద్రాలను నో సెల్‌ఫోన్‌ జోన్లుగా అమలుపరుస్తారు. విద్యార్థులు, ఇన్విజిలెటర్లు, పరీక్ష నిర్వహణ సిబ్బంది సహా అందరికి ఈ నిబంధన వర్తించనుంది. ఒక్క అబ్జర్వర్‌ను మాత్రమే సెల్‌ఫోన్‌తో అనుమతించినా గానీ పరీక్షా హాల్లోకి మాత్రం వీరు సెల్‌ఫోన్‌ తీసుకెళ్లడానికి అనుమతిలేదు. అది పరీక్ష మొదలైన 15 నిమిషాల వరకు మాత్రమే సెల్‌ఫోన్‌ను వాడేందుకు అనుమతిస్తారు. పరీక్షకు ఎంత మంది విద్యార్థులు హాజరయ్యారోనన్న సమాచారాన్ని ఉన్నతాధికారులకు చేరవేసేందుకు మాత్రమే 15 నిమిషాల వరకు అనుమతిస్తారు. ఎంసెట్‌తో పాటు- ఎడ్‌సెట్‌, లాసెట్‌, ఐసెట్‌, ఈసెట్‌, పీజీఈసెట్‌, పీఈసెట్‌లన్నింటిని ఇవ నిబంధనలు వర్తించనున్నాయి.

ఒకే రోజు మూడు సెషన్లలో ఎడ్‌సెట్‌, లాసెట్‌
ఇక లాసెట్‌, ఎడ్‌సెట్‌ పరీక్షలు ఒకే రోజు మూడు సెషన్లలో నిర్వహించనున్నారు. మిగిలిన సెట్‌లను రెండు సెషన్ల చొప్పున పూర్తి చేయనున్నారు. ఎడ్‌సెట్‌ ఈనెల 18న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మొత్తం మూడు షిప్టుల్లో, లాసెట్‌ను ఈనెల 25న ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూడు షిప్టుల్లో నిర్వహించనున్నారు. ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌ పరీక్షలను మాత్రం రెండు సెషన్లలో పూర్తి చేయనున్నారు.

ఆలస్యమైతే అనుమతిలేదు: ప్రొ.ఆర్‌.లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌
ఆలస్యమైతే పరీక్ష కేంద్రాల్లో అనుమతించబోమని ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబ్రాది తెలిపారు. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంసెట్‌కు ఈ ఏడాది అదనంగా 50వేల దరఖాస్తులొచ్చాయన్నారు. ఇప్పటికే 2.5లక్షలకు పైగా విద్యార్థులు హాల్‌ టికెట్లు- డౌన్‌లోడ్‌ చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నాయి. ఈ నెల 10, 11 తేదీల్లో అగ్రికల్చర్‌, ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం ఎంసెట్‌కు భారీగా దరఖాస్తులొచ్చిన నేపథ్యంలో కొత్తగా 28 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు- చేశామన్నారు. గతేడాది 2.66 లక్షల దరఖాస్తులు కాగా, ఈ ఏడాది 3.20 లక్షల దరఖాస్తులొచ్చాన్నారు. ఈ సంవత్సరం అగ్రికల్చర్‌, మెడికల్‌కు 113, ఇంజినీరింగ్‌కు 137 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు- చేశామన్నారు. ఇక ఎంసెట్‌ దరకాస్తు స్వీకరణ మంగళవారం అర్ధరాత్రితో ముగియనుండగా, దరఖాస్తుల సంఖ్య స్వల్పంగా పెరగనుంది. విద్యార్థులు నిర్ణీత సమయానికి పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, ఆలస్యమైతే అనుమతించేది లేదని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులు -టె-న్షన్‌కు గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ సమావేశంలో జేఎఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ కట్టా నర్సింహారెడ్డి, ఉన్నత విద్యామండలి కార్యదర్శి డాక్టర్‌ శ్రీనివాస్‌రావు, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ డీన్‌కుమార్‌, కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయ్‌కుమార్‌రెడ్డి, ఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ శ్రీరాం వెంకటేష్‌, పీజీఈసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ రవీంద్రారెడ్డి, లాసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ విజయలక్షీ, ఎడ్‌సెడ్‌ కో కన్వీనర్‌ ప్రొఫెసర్‌ పారుపల్లి శంకర్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

సెట్ల వారిగా దరఖాస్తుల వివరాలు..

- Advertisement -

ప్రవేశ పరీక్ష 2023 2022

ఎంసెట్‌ 3,20,587 2,66,714
ఎడ్‌సెట్‌ 29,390 38,091
ఈసెట్‌ 21,586 24,095
లాసెట్‌ 41,439 36,332
ఐసెట్‌ 43,242 75,952
పీజీఈసెట్‌ 13,636 14,612

Advertisement

తాజా వార్తలు

Advertisement