Monday, April 29, 2024

ఏపీలో మరో పోర్టు ప్రైవేట్‌ సంస్థకు సమర్పయామి

అదానీ గ్రూప్‌లో మరో పోర్టు చేరింది. ఇప్పటికే ఏపీలోని కృష్ణపట్నం పోర్టును సొంతం చేసుకున్న అదానీ గ్రూప్… తాజాగా ఏపీలోని విశాఖ సమీపంలో ఉన్న గంగవరం పోర్టులో మెజారిటీ వాటాలు తమ సొంతం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. డీవీఎస్‌ రాజు, ఆయన కుటుంబానికి ఉన్న 58.1 శాతం వాటా కొనుగోలుకు రూ.3,604 కోట్ల ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది. ఇప్పటికే ఈ పోర్టు కంపెనీలో 31.5 శాతం వాటాను రూ.1,954 కోట్లకు వార్‌బర్గ్‌ పింకస్‌ అనే విదేశీ సంస్థకు అనుబంధంగా ఉన్న విండీ లేక్‌సైడ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ లిమిటెడ్‌ నుంచి కొనుగోలు చేసేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఈ పోర్టు కంపెనీలో అదానీ గ్రూపునకు చెందిన అదానీ పోర్ట్స్‌ అండ్‌ ఎస్‌ఈజెడ్‌ లిమిటెడ్‌ వాటా 89.6 శాతానికి చేరనుంది.

గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్‌లోని రెండో అతిపెద్ద నాన్‌ మేజర్‌ పోర్టు. దీని వార్షిక సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. ఏ సీజన్‌లో అయినా సరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించే అవకాశం ఈ పోర్టుకు ఉంది. బాగా లోతైన పోర్టు కావటంతో 2 లక్షల డీడబ్ల్యూటీ సామర్థ్యం గల సూపర్‌ కేప్‌ సైజ్‌ ఓడలూ వచ్చిపోగలవు. దాదాపు 1800 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పోర్టులో 9 బెర్తులు ఉన్నాయి. బొగ్గు, ఇనుప ఖనిజం, ఎరువులు, సున్నపురాయి, బాక్సైట్‌, పంచదార, అల్యూమినియం, ఉక్కు ఎగుమతులతో పాటు దిగుమతులు పెద్దఎత్తున సాగుతున్నాయి. తూర్పు,పడమర, దక్షిణ, మధ్య భారతదేశంలోని 8 రాష్ట్రాల నుంచి గంగవరం పోర్టుకు సరకు రవాణా సాగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement