టీకా పేరుతో అధికారులు ఆధార్ కార్డు మాత్రమే కావాలని అడగొద్దని, సుప్రీంకోర్టు తెలిపింది. పూణేకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త సిద్ధార్థశంకర్ శర్మ దాఖలు చేసిన PILపై ఇవ్వాల న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ , సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
COVID-19 వ్యాక్సినేషన్ కోసం CO-WIN పోర్టల్లో ఆధార్ కార్డ్ వివరాలను సమర్పించడం తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. ఈ సందర్భంగా ప్రజలను ఆధార్ కార్డ్ కోసం పట్టుబట్టవద్దని అధికారులను సుప్రీంకోర్టు ఆదేశించింది. టీకా కోసం కొన్ని సెంటర్లలో ఆధార్ కార్డు కావాలని అడుగుతున్నారన్న దానిపై పిల్ విచారణ సందర్భంగా న్యాయమూర్తులు డివై చంద్రచూడ్ , సూర్యకాంత్లతో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.
కొవిడ్19 టీకా, ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) పిటిషన్లో అఫిడవిట్ను దాఖలు చేసింది. CO-WIN పోర్టల్లో నమోదు చేయడానికి ఆధార్ కార్డ్ తప్పనిసరి కాదని, తొమ్మిది ఐడెంటిటీ కార్డుల్లో ఏదైనా ఒకదానిని సమర్పించవచ్చని తెలిపింది. వ్యాక్సినేషన్ తీసుకోవడానికి ఆధార్ తప్పనిసరి కాదని పేర్కొంది. సంబంధిత అధికారులందరూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విధానానికి అనుగుణంగా పనిచేస్తారని పిల్ విచారణ సందర్భంగా బెంచ్ పేర్కొంది.
ఆధార్ ఒక్కటే ముందస్తు షరతు కాదని, ఎలాంటి గుర్తింపు కార్డు లేని 87 లక్షల మందికి టీకాలు వేశామని మంత్రిత్వ శాఖ తరఫు న్యాయవాది అమన్ శర్మ బెంచ్కి చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రాలు ఆధార్ కార్డు అడగకూడదని పిటిషనర్ తరపున వాదించిన న్యాయవాది మయాంక్ క్షీరసాగర్ అన్నారు. కొవిడ్-19 వ్యాక్సినేషన్ సెంటర్/వ్యాక్సినేటర్ కోసం CO-WIN పోర్టల్లో ఆధార్ వివరాలను సమర్పించే తప్పనిసరి ముందస్తు షరతును తొలగించాలని దీనికి తగు ఆదేశాలివ్వాలని ఫిర్యాదు దారు కోరారు. దీనికి తగ్గట్టు CO-WIN పోర్టల్లో అవసరమైన మార్పులు చేయడానికి ఎలక్ట్రానిక్స్ , ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు దిశానిర్దేశం చేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. CO-WIN పోర్టల్ను తగిన సాఫ్ట్ వేర్/సాంకేతిక పరిజ్ఞానంతో అప్డేట్ చేయాలని, యూజర్ ఫ్రెండ్లీగా దేశంలోని పౌరులంతా ఉపయోగించేలా చూడాలని కేంద్రాన్ని కోరారు.