Monday, May 6, 2024

దేశంలో కొత్తగా 3016 కరోనా పాజిటివ్ కేసులు

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 24 గంటల వ్యవధిలో కొత్త కేసులు మూడు వేలకు పైనే నమోదయ్యాయి. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 1,10,522 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 3,016 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ స్థాయిలో కొత్త కేసులు నమోదు కావడం ఇదే మొదటి సారి. గతేడాది అక్టోబర్‌ 2వ తేదీన 3,375 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

తాజా కేసులతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,47,12,692కి చేరింది. కాగా నిన్నటితో పోలిస్తే (నిన్న 2151 కేసులు) కొత్త కేసుల్లో 40 శాతం పెరుగుదల కనిపిస్తోంది. ఇక దేశంలో రోజూవారీ కొవిడ్‌ ఇన్‌ఫెక్షన్‌లో 50 శాతం పెరుగుదల కనిపిస్తోంది. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో 14 మంది మృతి చెందారు. మహారాష్ట్రలో ముగ్గురు, ఢిల్లీలో ఇద్దరు, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఒకరు, కేరళలో ఎనిమిది మంది చనిపోయారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 5,30,862గా నమోదైంది. ఇక ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.03 శాతం యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement