Friday, April 26, 2024

జెయింట్ వీల్ ను తలపిస్తున్న రైల్వే వంతెన..

భారతీయ రైల్వే అరుదైన రికార్డు తన సొంతం చేసుకుంది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆర్చ్ నిర్మాణాన్ని పూర్తి చేసింది. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తైన ఈ బ్రిడ్జి నిర్మాణం మరో ఏడాదిలో పూర్తవుతుందని భావిస్తున్నారు. జమ్మూకశ్మీర్‌లోని చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో 1.3 కిలోమీటర్ల పొడవైన రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. కశ్మీర్ లోయను మిగతా ప్రాంతాలతో ఈ బ్రిడ్జి అనుసంధానిస్తుంది. బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా నిన్న అత్యంత క్లిష్టమైన ఆర్చ్ నిర్మాణం పూర్తికాగా, మరో రెండున్నరేళ్లలో రైలు మార్గాన్ని పూర్తిచేస్తామని ఉత్తర రైల్వే జనరల్ మేనేజర్ అశుతోష్ గంగాల్ తెలిపారు. ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్టులో భాగంగా రూ. 1486 కోట్ల వ్యయంతో దీనిని చేపట్టారు.

బ్రిడ్జి నిర్మాణంలో 28,660 మెట్రిక్ టన్నుల ఉక్కు, 10 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని, 66 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పని జరిగింది. ఆర్చ్ మొత్తం బరువు 10,610 టన్నులు. గంటకు 266 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను, అత్యంత తీవ్రతతో సంభవించే భూకంపాలను కూడా ఈ వంతెన తట్టుకుంటుంది. భారతీయ రైల్వే చరిత్రలో ఇలాంటి నిర్మాణం ఇదే తొలిసారని గంగాల్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement