Sunday, May 12, 2024

అవసరం వచ్చింది కాబట్టే.. అప్పు చేశాం: బుగ్గన

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. బడ్జెట్ అంచనాల కంటే ఎక్కువ అప్పులు చేసిన విషయం నిజమేనని స్పష్టం చేశారు. కరోనా వైరస్ వల్ల రాష్ట్రానికి వచ్చే ఆదాయం పడిపోయిందని… ఇదే సమయంలో ఖర్చు బాగా పెరిగిందని తెలిపారు. ఈ పరిస్థితిని ఒక్క ఏపీ మాత్రమే ఎదుర్కోవడం లేదని, అనేక రాష్ట్రాలు ఇదే సమస్యతో ఇబ్బంది పడుతున్నాయని చెప్పారు. గత ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో కరోనా నియంత్రణ కోసం ప్రతి రోజు వందల కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వచ్చిందన్నారు. తమది సంక్షేమ ప్రభుత్వం అని.. అందుకే ఎక్కువ మొత్తంలో డబ్బు అవసరమవుతోందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలను చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు అప్పులు అంటూ విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు.

అటు కర్నూలులో తనపై చంద్రబాబు చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని బుగ్గన రాజేంద్రనాథ్ తెలిపారు. అవినీతిపై చర్చకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. వందేళ్లుగా తన కుటుంబం మైనింగ్ రంగంలో ఉందని చెప్పారు. అయినా పాత కారునే వాడుతున్నానని, అపార్ట్‌మెంట్‌లోనే ఉంటున్నానని చెప్పారు. ఇక డబ్బు అవసరం ఉన్నందునే అప్పు చేశామనే విషయాన్ని గర్వంగా చెబుతున్నామన్నారు. ఇందులో దాపరికం ఏమీ లేదన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement