Saturday, May 4, 2024

T20 World Cup : టి20 ప్ర‌పంచ క‌ప్ స్క్వాడ్ కు క‌స‌ర‌త్తు …సీనియ‌ర్స్ కే పెద్ద పీట …

ప్రస్తుతం ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఈ మెగా లీగ్‌ ముగిసిన ఐదు రోజుల్లోనే టీ20 ప్రపంచ కప్ వచ్చేయనుంది. జూన్ 1 నుంచి పొట్టి కప్ సంబరం మొదలు కానుంది. విండీస్ – యూఎస్‌ఏ ఆతిథ్యం ఇవ్వనుంది. ఇంకా ఏ దేశం తమ జట్టును ప్రకటించలేదు. రోహిత్ శర్మ నాయకత్వంలోనే టీమ్‌ఇండియా బరిలోకి దిగుతుందని ఇప్పటికే బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు. గత వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు చేరిన టీమ్‌ఇండియా రన్నరప్‌గా నిలిచింది. దాదాపు పదేళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్‌కు నిరీక్షణ తప్పడం లేదు. ఈసారైనా ఆ లోటును పూరించాలని అభిమానులు కోరుతున్నారు.

ఇది ఇలా ఉంటే 15 మందితో కూడిన జట్టును మరో రెండు వారాల్లో బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. అప్పటికి ఐపీఎల్‌లో దాదాపు సగం మ్యాచ్‌లు ముగుస్తాయి. ప్లేయర్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌ను పరిగణనలోకి తీసుకొని జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ప్రతీ దేశం మే 1 నాటికి ప్రాబుబల్స్‌ను ఐసీసీ కమిటీకి పంపించాలి. ఆ తర్వాత మే 25 వరకు అందులో ఏమైనా మార్పులు ఉంటే చేసుకోవడానికి ఆయా బోర్డులకు ఛాన్స్‌ ఉంటుంది. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల ప్రకారం స్క్వాడ్‌లో సీనియర్లకే అవకాశాలు ఉన్నట్లు స‌మాచారం. రెండు లేదా మూడు మార్పులు మాత్రమే ఉండనున్నాయి. ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌గా మారిన మయాంక్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవచ్చని క్రికెట్ విశ్లేషకుల అంచనా. అతడు ఫిట్‌గా ఉండటమూ చాలా కీలకం. దాదాపు 15 నెలల తర్వాత మైదానంలోకి అడుగుపెట్టిన రిషభ్‌ పంత్‌తోపాటు రింకు సింగ్‌, యశస్వి జైస్వాల్ అవకాశం దక్కనుంది.

- Advertisement -

భారత జట్టు (అంచనా):
రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్‌ యాదవ్, హార్దిక్‌ పాండ్య, రిషభ్‌ పంత్ (వికెట్ కీపర్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), రింకు సింగ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్/చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా, , సిరాజ్, మయాంక్‌ యాదవ్.

Advertisement

తాజా వార్తలు

Advertisement