దుబాయ్ : టెస్టు ర్యాంకింగ్స్ను ఐసీసీ బుధవారం విడుదల చేసింది. కేన్ విలియమ్సన్ ఒక స్థానం దిగజారాడు. 888 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఆసీస్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ 891 పాయింట్స్తో రెండో స్థానానికి ఎగబాకాడు. 903 పాయింట్లతో ఇంగ్లండ్ కెప్టెన్ జోరూట్ టాప్లో ఉన్నాడు. రోహిత్ శర్మ (805), విరాట్ కోహ్లీ (775) వరుసగా ఐదు, ఆరో స్థానాల్లో ఉన్నారు. భారత్తో జరిగిన తొలి టెస్టులో అర్ధ సెంచరీ చేసిన కివీస్ బ్యాటర్ లాథమ్.. 726 పాయింట్లతో 5 స్థానాలు ఎగబాకి 9వ స్థానంలో నిలిచాడు.
శ్రీలంక కెప్టెన్ కరుణ రత్నే 4 స్థానాలు ఎగబాకి ఏడో స్థానంలో నిలిచాడు. బౌలింగ్లో పాక్ పేసర్ షాహిన్ అఫ్రిది 3 స్థానాలు ఎగబాకి 810 పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. బంగ్లాతో టెస్టులో 7 వికెట్లతో రెచ్చిపోయాడు. జేమిసన్ 6 స్థానాలు ఎగబాకి 776 పాయింట్లతో 9వ స్థానంలో నిలిచాడు. టీమిండియా నుంచి అశ్విన్ (840) రెండో స్థానంలో ఉండగా.. బుమ్రా (763) 10వ స్థానంలో నిలిచాడు. 908 పాయింట్లతో ప్యాట్ కమిన్స్ టాప్లో ఉన్నాడు.