Thursday, June 13, 2024

Asia Cup U-19 | యువ భారత్‌ శుభారంభం.. అఫ్ఘాన్‌పై ఘన విజయం

అండర్‌-19 ఆసియా కప్‌లో యువ భారత్‌ శుభారంభం చేసింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్లతో అఫ్ఘానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. అఫ్ఘాన్‌ నిర్ధేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 37.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన అర్షిన్‌ కులకర్ణీ ముందు బౌలింగ్‌లో (3/46), తర్వాత బ్యాటింగ్‌లో (70 నాటౌట్‌; 105 బంతుల్లో 4 ఫోర్లు) సత్తా చాటాడు. దుబాయ్‌ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అఎn్గానిస్తాన్‌ అండర్‌-19 జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైపోయింది.

భారత బౌలర్లు ఆరంభ నుంచే కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో అఎn్గాన్‌ వరుస క్రమంలో వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్‌ జంషిద్‌ జద్రాన్‌ (43; 75 బంతుల్లో 4 ఫోర్లు) ఒక్కడు ఒంటరి పోరాటం చేయడంతో అఫ్ఘాన్‌ ఆమాత్రం స్కోరు నమోదు చేయగలిగింది. ఇతర బ్యాటర్లలో మహ్మద్‌ యునూస్‌ (26), నౌమన్‌ షా (25), అక్రమ్‌ (20) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో అర్షిన్‌ కులకర్ణీ (8-0-29-3), రాజ్‌ లింబానీ (10-0-46-3) అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. మరోవైపు నమన్‌ తివారీ కూడా 10 ఓవర్లలో 30 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు.

అనంతరం స్వల్ప లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన యువ భారత్‌ ఆరంభం కలిసి రాలేదు. ఓపెనర్‌ ఆదర్ష్‌ సింగ్‌ (14), రుద్ర పటేల్‌ (5) తక్కువ పరుగులకే వెనుదిరగడంతో టీమిండియా 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ సమయంలో మరో ఓపెనర్‌ అర్షిన్‌ కులకర్ణీ, సారథి ఉదయ్‌ శరణ్‌ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఇద్దరూ సమన్వయంతో ఆడుతూ స్కోరుబోర్డును ముందుకు సాగించారు.

- Advertisement -

కానీ 49 బంతుల్లో 2 ఫోర్లతో 20 పరుగులు చేసిన కెప్టెన్‌ ఉదయ్‌ని వహిదుల్లా తెలివైన బంతితో ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌ 76 స్కోరు వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. అనంతరం అర్షిన్‌ కులకర్ణీ (70 నాటౌట్‌; 105 బంతుల్లో 4 ఫోర్లు), ముషీర్‌ ఖాన్‌ (48 నాటౌట్‌; 53 బంతుల్లో 3 ఫోర్లు) అజేయంగా ఉండి టీమిండియాను విజయతీరాలకు చేర్పించారు. భారత్‌ 37.3 ఓవర్లలో 174/3 పరుగులు చేసి టోర్నీలో శుభారంభం చేసింది.

నేపాల్‌పై పాక్‌ గెలుపు..

ఇక్కడ జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై గెలుపొందింది. గ్రూప్‌-ఎలో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్‌ చేసిన నేపాల్‌ అండర్‌-19 జట్టు ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 47.2 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. నేపాల్‌ బ్యాటర్లలో ఉత్తమ్‌ మాగర్‌ (51; 76 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. దిపేష్‌ కండెల్‌ (31), అర్జున్‌ కుమాల్‌ (21) పరుగులు చేశారు. పాక్‌ బౌలర్లలో మహ్మద్‌ జిషాన్‌ (9.2-1-19-6) విధ్వంసం సృష్టించాడు. మరోవైపు అమీర్‌ హస్సన్‌ కూడా (10-2-15-2) కట్టు దిట్టంగా బౌలింగ్‌ చేశాడు. అనంతరం లక్ష్యచేదనకు దిగిన పాక్‌ 26.2 ఓవర్లలోనే 3 వికెట్లు మాత్రమే కోల్పోయి (153/3) సునాయాసంగా విజయాన్ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement