Wednesday, May 1, 2024

దేశం అభివృద్ది చెందాలంటే యువత వారానికి 70 గంటలు పని చేయాలి : ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి

దేశంలోని ప్ర‌ముఖ ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి ఒక టీవీ షోలో కీలక వ్యాఖ్యలు చేశారు. 3వన్4 క్యాపిటల్ రూపొందిస్తున్న వీడియో సిరీస్ ‘ది రికార్డ్’ ఫ‌స్ట్ ఎపిసోడ్ లో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీ పడేలా భారత్ పురోగతి సాధించాలంటే.. దేశంలోని యువత వారానికి 70 గంటలు పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలి అని అన్నారు. ప్రొడక్టవిటీ పెంచేలా హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని పేర్కొన్నారు. ‘ఇది నా దేశం, వారానికి 70 గంట‌లు పని చేస్తాను’ అని దేశంలోని యువత ప్రతిజ్ఞకు పూనుకోవాలని నారాయణమూర్తి సూచించారు.

భారత్ లోని యుతవ వెస్టర్న్ కంట్రీస్ నుంచి అనవసరమైన అలవాట్లను నేర్చుకుంటుకున్నారని మూర్తి అన్నారు. గత 25-30 ఏళ్లలో వేగంగా పురోగతి సాధించిన దేశాలను చూసుకుంటే, ప్రత్యేకించి చైనా లాంటి దేశాల్లో విధానమైన నిర్ణయాల వల్లే అభివృద్ధి సాధ్యమైందని వివరించారు. అలాంటి నిర్ణయాలు మనం కూడా తీసుకుంటే వేగంగా అభివృద్ధి చెందవచ్చన్నారు.

రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ, జపాన్ దేశాల్లో ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు తమ ఆర్థిక వ్యవస్థను పునర్నిర్మించేందుకు ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకున్నారో నారాయణమూర్తి ఊదాహరించారు. కొన్నేళ్ల పాటు ప్రతి ఒక్కరు ఎక్కువ గంటలు పనిచేసేలా జర్మనీ విధానాలు రూపొందించి అమలు చేసినట్లు తెలిపారు. జపాన్ కూడా ఇలానే చేసిందన్నారు. ప్రస్తుతం భారత్ కూడా వేగంగా పురోగమిస్తున్న దేశాల్లో ఒకటిగా గుర్తింపు పొందిందని, దీన్ని ఇలాగే కొనసాగించాలంటే యువత ఇంకా ఎక్కువ శ్రమించాలని సూచించారు.

- Advertisement -

కాగా, వర్క్ ఫ్రం హోం కంటే ఆఫీస్ నుంచి పని చేస్తేనే ప్రొడక్టివిటీ ఎక్కువగా ఉంటుందని కూడా నారాయణమూర్తి అన్నారు. అయితే నారాయణమూర్తి వ్యాఖ్యలతో పలువురు ఐటీ ఉద్యోగులు విభేదించారు. రోజుకు 12 గంటలు పనిచేస్తే మానసిక సమస్యలు వస్తాయని, పని ఒత్తిడి కూడా పెరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరికొందరేమో వేతనాలు ఎక్కువగా చెల్లిస్తే ఉద్యోగులు ఎన్ని గంటలైనా పనిచేసేందుకు సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement