సూర్యాపేట: తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వస్తే బిసి వర్గానికి చెందిన వ్యక్తినే ముఖ్యమంత్రి చేస్తామని బిజెపి అగ్రనేత , హోమంత్రి అమిత్ షా ప్రకటించారు..ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన భాజపా జన గర్జన సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తూ, కాంగ్రెస్, బిఆర్ఎస్ లు బిసిలకు చేసిందేమి లేదంటూ విమర్శించారు.. కాంగ్రెస్ వల్ల దేశం సర్వం దోపిడికి గురైతే, బిఆర్ఎస్ వల్ల తెలంగాణ సర్వనాశనం అయిందని మండిపడ్డారు.. రెండు పార్టీలు అభివృద్ధికి నిరోధకలని పేర్కొన్నారు.. కాంగ్రెస్ పార్టీ రాహుల్ ను ప్రధానిని చేయాలని అలోచిస్తుంటే, కెటిఆర్ ను రాష్ట్ర ముఖ్యమంత్రిని చేయాలని ఎత్తులు వేస్తున్నారని అమిత్ ఆరోపిచారు.. ఆ రెండు పార్టీలు కుటుంబ పార్టీలు కావడం వల్లే స్వంత కుటుంబ అభివృద్దే తప్ప ప్రజలకు ఎటువంటి అభివృద్ది పనులు చేయరంటూ విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోడీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ”కేటీఆర్ను సీఎంను చేయాలని కేసీఆర్ ఆలోచిస్తుంటారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయాలని సోనియాగాంధీ చూస్తుంటారు. కేసీఆర్, సోనియాకు వాళ్ల కుటుంబం మాత్రమే ముఖ్యం. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే భారాస, కాంగ్రెస్ లక్ష్యం. భాజపా మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది. భారాస.. పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ. కేసీఆర్ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా? దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కేసీఆర్ చెప్పాలి. రూ.50వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలి. రూ.10వేల కోట్లతో బీసీ సంక్షేమ కార్యక్రమాలు అన్నారు.. ఏం చేశారో చెప్పాలి. బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోడీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేశారు. సమ్మక్క-సారక్క పేరుతో ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తాం. పసుపు రైతుల కోసం పసుపు బోర్డు ఏర్పాటు చేస్తున్నాం. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోడీ ముందుకు వచ్చారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేశారు” అని అమిత్ షా తెలిపారు.