Sunday, May 5, 2024

ప్రియుడితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి

పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఓ యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది. ప్రియుడితో తన పెళ్లి చేయకుంటే వాటర్ ట్యాంక్ పైనుంచి దూకేస్తానంటూ హెచ్చరించింది. పాలకొల్లులోని స్థానిక బెత్లహాంపేటకు చెందిన పెట్టెల కేశవాణి తన మేనమామ కుమారుడైన యడ్ల భాస్కర్‌ను ఏడేళ్లుగా ప్రేమిస్తోంది. రెండు రోజుల క్రితం భాస్కర్ వద్ద యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా అందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసి తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంది. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో నిన్న స్థానికంగా ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి హల్‌చల్ చేసింది.

భాస్కర్‌తో తనకు వివాహం చేయకుంటే పైనుంచి దూకేస్తానని హెచ్చరిస్తూ కుటుంబ సభ్యులకు యువతి వాట్సాప్ వీడియో పంపింది. అది చూసి కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతితో ఫోన్‌లో మాట్లాడారు. భాస్కర్‌ను తీసుకొచ్చి వివాహానికి ఒప్పించారు. దీంతో కేశవాణి కిందికి దిగింది. అనంతరం ఇద్దరినీ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత సమీపంలోని ఆలయానికి తీసుకెళ్లి ఇద్దరికీ వివాహం జరిపించడంతో కథ సుఖాంతమైంది.

ఈ వార్త కూడా చదవండి: నైటీలు ధరించి దొంగతనాలకు వచ్చిన దుండగులు

Advertisement

తాజా వార్తలు

Advertisement