Sunday, May 5, 2024

BRS ప్ర‌భుత్వాన్ని సాదుకుంటారా.. సంపుకుంటారా : మంత్రి పువ్వాడ

సత్తుపల్లి (ఖమ్మం) : రాష్ట్ర ప్రగతి కోసం అనునిత్యం అలుపెరగుండా కృషి చేస్తూ.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని సాదుకుంటారా లేదంటే.. సంపుకుంటారా ఆలోచించాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. BRS రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా ఖమ్మం జిల్లా సతుపల్లి నియోజకవర్గం రామానుజవరం గ్రామంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పువ్వాడ పాల్గొని ప్రసంగించారు. మన రాష్ట్రంలో 4 కోట్ల పై బడిన ప్రజానీకం ఉందని, అందుకు సరిపోను తిండి గింజలు మన రాష్ట్రంలోనే పండిస్తున్నామన్నారు. మన రాష్ట్రంతో పాటు ఇతర అనేక రాష్ట్రాలకు తిండి గింజలు అందిస్తున్న గొప్ప రాష్ట్రం మనది.. ముఖ్యంగా సత్తుపల్లి నియోజకవర్గంది అని అన్నారు.

ఖ‌మ్మం జిల్లాలోని చివరి ఎకరా వరకు సాగర్ జలాలు అందేలా ఎమ్మెల్యే సండ్ర విశేష కృషి చేస్తున్నారని, ఇంత చొరవ వేరే నాయకులకు ఉంటదా.. అంత చొరవ చూపగలరా అని అన్నారు. కాకరకాయ కూడా పంచని నేతలు, ఎన్నికలు సమీపిస్తుండటంతో తగుదునమ్మా అంటూ అనేక మంది వస్తారని వాళ్లకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. కరోనా సమయంలో గ్రామ గ్రామంలో, క్వారంటైన్ కేంద్రాలు, ఇళ్ళల్లో తిరిగి వారికి కావాల్సిన సదుపాయాలు అందించిన విషయం గుర్తు చేశారు. కష్టకాలంలో ప్రజలను ఆదుకోని నాయకులను ఇప్పుడు వచ్చి ప్రజలకు ఏం చేస్తారో ప్రజలే గుర్తించాల్సిన అవసరం ఉంది. ఇచ్చిన తెలంగాణను వెనక్కు తీసుకున్న సమయంలో మళ్ళీ కేసీఆర్ నిరాహార దీక్ష చేపట్టి సావునోట్లో తలకాయ పెట్టి చివరి అంచుల దాకా పోయిన నాయ‌కుడు అన్నారు. కేసీఆర్ పోరాట పటిమ వల్లే మళ్ళీ తెలంగాణను సాధించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని విజయవంతంగా నడిపిస్తుంటే కొన్ని దుష్ట శక్తులు ప్రభుత్వాన్ని అస్థిర పరచాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ సమావేశంలో సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, డిసిసిబి, డీసీఎంఎస్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement