Tuesday, May 7, 2024

అదనపు ఫీజు వసూలు చేసే కాలేజీలపై కొరడా.. ఎక్కువ వసూలు చేస్తే జరిమానా

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఇంజనీరింగ్‌ కాలేజీలకు తెలంగాణ అడ్మిషన్స్‌ అండ్‌ ఫీ రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) హెచ్చరించింది. టీఏఎఫ్‌ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేస్తే జరిమానా తప్పదని స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చింది. జీవో నంబర్‌ 37 ప్రకారం అందులో సూచించిన ఫీజుల కన్నా ఎక్కువ వసూలు చేయకూడదని, ఏ ఇతర రూపాల్లోనూ డబ్బులు వసూలు చేయకూడదని కాలేజీలకు తేల్చి చెప్పింది. ఒకవేళ అదనంగా ఫీజు వసూలు చేస్తే రూ.2 లక్షల జరిమానా వేస్తామని స్పష్టం చేసింది. అది కూడా ఒక్కసారి కాకుండా ఎంతమంది విద్యార్థుల దగ్గర ఎక్కువ ఫీజు వసూలు చేస్తే అన్ని సార్లు రూ.2 లక్షలు కట్టించుకుంటామని ఆ కమిటీ పేర్కొంది. ఈ మేరకు శనివారం కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది. అదనంగా తీసుకున్న ఫీజును విద్యార్థులకు తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

తక్కువ మెరిట్‌ వాళ్లకిస్తే రూ.10 లక్షలు ఫైన్‌…

ఇంజనీరింగ్‌ కాలేజీలు విద్యార్థుల నుంచి అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఫిర్యాదులు అందిన నేపథ్యంలో టీఏఎఫ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ ఆధ్వర్యంలో విద్యాశాఖ సెక్రటరీ, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, ఓయూ, జేఎన్టీయూ అధికారులతో సమావేశం నిర్వహించారు. బీ-కేటగిరీ సీట్ల కోసం ఏఎఫ్‌ఆర్‌సీ ద్వారా కాలేజీలకు తమ పేర్లను విద్యార్థులు పంపినా దరఖాస్తులు కాలేజీలకు అందడం లేదన్న ఫిర్యాదు వచ్చిన నేపథ్యంలో కమిటీ సీరియస్‌ అయ్యింది. అయితే వీరి కేసులు మెరిట్‌పై పరిగణించబడతయా లేదా? అన్న అనేది కమిటీ పరిశీలిస్తోంది. ఆ దరఖాస్తులను ఆయా కాలేజీలు మెరిట్‌పై పరిగణించకపోతే చర్యలు తీసుకోవడానికి కమిటీ చర్యలు తీసుకోనుంది. ఏఎఫ్‌ఆర్‌సీ ద్వారా దరఖాస్తులు ఫార్వార్డ్‌ చేయబడిన విద్యార్థుల మెరిట్‌ కంటే తక్కువ మెరిట్‌ ఉన్న విద్యార్థులకు సీటు ఇస్తే రూ.10 లక్షల జరిమానా విధించనున్నట్లు తెలిపింది. ఈ రెండు జరిమానాలును సంబంధిత కన్వీనర్‌ వద్ద ఉన్న నిధుల నుండి వసూలు చేయబడతాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement