Saturday, April 27, 2024

TS | సీఎం కేసీఆర్ దార్శనిక విదానాలు.. పదింతలు పెరిగిన ధాన్యం దిగుబడి

తొమ్మిదేళ్లలో తెలంగాణ.. దేశానికి అన్నపూర్ణగా మారిందని, సీఎం కేసీఆర్ దార్శనిక రైతు అనుకూల విధానాలతో సాధించిన పదిరెట్ల ధాన్యం దిగుబడికి అనుగుణంగా మిల్లింగ్ ఇండస్ట్రీని పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఇవ్వాల (బుధ‌వారం) బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎస్పీఈజడ్ అధికారులు, జపాన్ సటాకె కార్పోరేషన్ ప్రతినిధులతో మంత్రి బేటీ అయ్యారు. 2014 లో 1815 రైస్ మిల్లులు ఉండగా నేటికి వాటి సంఖ్య 2574కి మాత్రమే పెరిగిందని, ఈ నేపథ్యంలో ఏటా మూడు కోట్ల టన్నులకు పైగా ఉత్పత్తవుతున్న ధాన్యాన్ని మిల్లింగ్ చేయడానికి తెలంగాణలో విసృత అవకాశాలున్నాయన్నారు.

ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ రెండువేల కోట్లతో పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మిల్లులను ఏర్పాటు చేయడానికి ఆదేశించారని, ఈ దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతుందన్నారు మంత్రి గంగుల కమలాకర్. ప్రపంచవ్యాప్తంగా వచ్చే లేటెస్ట్ టెక్నాలజీని ఒడిసిపట్టడంలో తెలంగాణ ముందుంటుందని, అదేరీతిన మిల్లింగ్ ఇండస్ట్రీలో సైతం అత్యాదునిక టెక్నాలజీని అందిపుచ్చుకొని రైతులకు ఉపయుక్తంగా ఉండేలా ఎప్పటికప్పుడు వారి పంటలకు మరింత మద్దతు అందించడమే ప్రథమ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ధాన్యం మిల్లింగ్ తో పాటు ఉప ఉత్పత్తులైన రైస్ బ్రాన్ ఆయిల్, నూక, తదితరాల ప్రాసెసింగ్ సైతం చేస్తామన్నారు. ఇందుకోసం ప్రపంచంలోనే అత్యాధునిక టెక్నాలజీ అందిస్తున్న సటాకే, సైలో తదితర కంపెనీల ప్రతినిదులతో చర్చిస్తున్నామన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా సటాకె కార్పోరేషన్, ఇతర కంపెనీల ప్రతినిదులు తమ కంపెనీల సాంకేతిక పరిజ్ణానాన్ని మంత్రికి వివరించారు, గంటకు 20 నుండి 1200 టన్నుల మిల్లింగ్ కెపాసిటీ తమ సొంతమని పేర్కొన్న ప్రతినిదులు, బాయిల్డ్, రా రైస్ దేనికైనా అనుగుణంగా అత్యంత అధునాతన పద్దతుల ద్వారా వ్యర్థం, వ్యయం తగ్గేలా టెక్నాలజీ అందిస్తున్నామన్నారు. అమెరికా, చైనా, థాయిలాండ్, వియాత్నాం తదితర దేశాలతో పాటు ఇండియాలోని తమ కార్యకలాపాలను వివరించారు. తెలంగాణలో మిల్లింగ్ ఇండస్ట్రీకి ఉన్న విసృత అవకాశాలతో ప్రభుత్వం దృడ సంకల్పంతో ఉండడంతో సటాకే కార్పోరేషన్ తరుపున సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసారు. కంపెనీ ప్రతినిధులతో అన్ని అంశాలు కూలంకషంగా చర్చించిన మంత్రి గంగుల, త్వరలోనే పూర్తి స్థాయి నివేదికను ముఖ్యమంత్రికి సమర్పిస్తామన్నారు.

ప్రభుత్వం మిల్లులను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లలో ప్రత్యేకంగా 100కోట్లకు పైగా పెట్టుబడి పెట్టినవారికి టేలర్ మేడ్ ఇన్సెంటివ్స్ అందిస్తుందన్నారు. ఈ జోన్లలో సాధారణ పెట్టుబడిదారులకు సైతం ఐదుసంవత్సరాల పాటు 2 రూపాయలకే యూనిట్ నాణ్యమైన కరెంట్, 75 శాతం వరకూ వడ్డీ మాపీ, మార్కెట్ ఫీజుల్లో 100 శాతం రాయితీలను అందిస్తుందన్నారు. వీటితో పాటు ఎస్సీ, ఎస్టీ, స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలకు ప్రత్యేక రాయితీలను అందిస్తూ ప్రోత్సహిస్తుందని, వీటిని ఆయా వర్గాల వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు మంత్రి గంగుల కమలాకర్

Advertisement

తాజా వార్తలు

Advertisement