Tuesday, April 30, 2024

ముగిసిన ‘విశాఖ ఉక్కు’ ఈవోఐ బిడ్‌.. మొత్తం 29 సంస్థల తరఫున బిడ్లు దాఖలు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గత పక్షం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక చర్చకు దారితీసిన విశాఖ ఉక్కు పరిశ్రమలో బిడ్‌ దాఖలు ప్రక్రియ గురువారంతో ముగిసింది. కేంద్ర ప్రభుత్వ రంగంలో కొనసాగుతున్న ఈ పరిశ్రమ ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ (ఈవోఐ) బిడ్‌కు ఆహ్వనం పలికిన విషయం తెలిసిందే. మొత్తం 29 సంస్థల తరఫున బిడ్లు రాగా, ఇందులో విదేశీ సంస్థలకు చెందినవి ఏడు బిడ్లు ఉన్నట్లు అనధికార వర్గాలు వెల్లించాయి. కాగా, తెలగు ప్రజలు, అఖిల పక్షం ఊహించినట్లుగా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ, అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గానీ బిడ్‌లో పాల్గొనలేదు. మరోవైపు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మే 3న రాష్ట్రవ్యప్తంగా రాస్తారోకోలకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక పిలుపునిచ్చింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో వర్కింగ్‌ కేపిటల్‌, ముడి సరుకు భాగస్వామ్యం కోసం ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ బిడ్ల దాఖలు గడువు ముగిసినా. తెలుగు రాష్ట్రాల్లోని రెండు ప్రభుత్వాలు కూడా ఏ విధంగానూ స్పందిచకపోవడం విశేషం. అధికారుల బృందం అధ్యయనం చేసింది కానీ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సింగరేణి నుంచి కూడా ఎలాంటి బిడ్లు దాఖలు కాలేదు. ఎన్‌ఎండీసీ లాంటి సంస్థలు ఏవీ ఈవోఐ దాఖలు చేయలేదని కార్మిక సంఘ నేతలు తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ వర్కింగ్‌ కేపిటల్‌, ముడి సరకు సరఫరా కోసం స్టీల్‌ వ్యాపారంలో గానీ.. స్టీల్‌ తయారీకి వినియోగించే ముడి సరకు వ్యాపారంలో ఉన్న వారి నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ మార్చి 27న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి ఓ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 15వ తేదీ వరకు గడువు ఇచ్చింది. దీన్ని మరో ఐదు రోజులు పొడిగిచారు.

- Advertisement -

బిడ్లను నేరుగా గానీ, మెయిల్‌ ద్వారా గానీ పంపేందుకు అవకాశం కల్పించారు. గడువు ముగిసేలోపు దాదాపు ఏడు విదేశీ సంస్థలు కూడా బిడ్లు దాఖలు చేసినట్లు- విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మిక నేత ఆయోధ్యరామ్‌ వెల్లడించారు. విదేశీ సంస్థలు మన స్టీల్‌ని కొనుగోలు చేసుకుని వెళ్తారని, మన బ్రాండ్‌ ఇమేజ్‌కి దెబ్బలేకుండా మనకు కావాల్సిన నిధులు సమకూర్చి.. ఆ మేరకు స్టీల్‌ వారికి సరఫరా చేసే ఒప్పందం వల్ల విశాఖ ఉక్కుకు ప్రయోజనం ఉంటుందని కార్మిక సంఘాలు అభిప్రాయడుతున్నాయి. స్టీల్‌ వ్యాపారంలో ఉన్న జేఎస్‌డబ్ల్యూ, జేఎస్పీఎల్‌ వంటివి విశాఖ స్టీల్‌కి ప్రధాన పోటీ దారులని, వాటిలో ఎటు-వంటి ఒప్పంద మైనా విశాఖ స్టీల్‌ బ్రాండ్‌ ఇమేజ్‌కే నష్టమని నేతలు చెబుతున్నారు.

ఐక్య పోరాటాలకు సిద్ధమవుతున్న అభిలపక్షం..

‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ అనే నినాదంతో పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ పోరాటానికి సిద్ధం కావాలని అఖిల పక్ష నేతలు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల నాయకులు ఈ అంశంపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మే 3వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు చేపడుతున్నట్లు నేతలు చెప్పారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా మే 3న ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్య రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement