Tuesday, May 7, 2024

ఎల్‌ఐసీ ఐపీఓకి అపూర్వ స్పందన, 1.74 రెట్లు అధికంగా సబ్‌ స్క్రిప్షన్‌..

దేశంలోనే అతిపెద్ద ఇన్సూరెన్స్‌ కంపెనీ అయిన లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఐపీఓ ప్రారంభమై.. ఆదివారానికి ఐదు రోజులు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నం 3.50 నిమిషాల సమయం నాటికి.. 1.74 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు అందాయి. రూ.21,000 కోట్లను సమీకరించాలనే ఉద్దేశంతో ఎల్‌ఐసీ సంస్థ ఐపీఓగా వచ్చేందుకు నిర్ణయించింది. పాలసీ హోల్డర్స్‌, ఉద్యోగులతో పాటు సాధారణ ఇన్వెస్టర్ల నుంచి ఎల్‌ఐసీ ఐపీఓకు ఎంతో స్పందన లభిస్తున్నది. రిటైల్‌ కేటగిరిలో పబ్లిక్‌ ఇష్యూలు 1.53 రెట్లు, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్స్‌ కేటగిరిలో 1.19 రెట్లు అధికంగా బిడ్డింగ్‌లు అందుకుంది. ఇక ఎల్‌ఐసీ ఉద్యోగుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. 3.70 రెట్లు అధికంగా బిడ్డింగ్‌కు వచ్చాయి. ఇక పాలసీదారుల నుంచి మాత్రం చాలా డిమాండ్‌ కనిపిస్తున్నది. ఏకంగా 4.88 రెట్లు అధికంగా బిడ్డింగ్‌కు వచ్చాయి. క్వాలిఫైడ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ బయ్యర్స్‌ (క్యూఐబీ) కేటగిరిలో 0.67 రెట్లు అధికంగా బిడ్డింగ్‌ అందుకున్నాయి. సాధారణంగా ఆదివారం ఐపీఓకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉండదు. కానీ ప్రభుత్వం ఈ విషయంలో సడలింపులు ఇచ్చింది.

పూర్తి స్థాయిలో ఎల్‌ఐసీ ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆల్‌ ఇండియా బ్యాంక్‌ ఆఫీసర్స్‌ కాన్ఫెడరేషన్‌ (ఏఐబీఓసీ) అయితే.. బ్లాక్డ్‌ అమౌంట్‌ (ఏఎస్‌బీఏ) నియమించబడిన శాఖల ద్వారా మద్దతు ఇవ్వబడిన అన్ని అప్లికేషన్‌లను ఆదివారం కూడా తెరిచి ఉంచడాన్ని తీవ్రంగా ఖండించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్ణయంతో చాలా వరకు దరఖాస్తులు డిజిటల్‌గా దాఖలు చేయబడినందున.. ఎటువంటి ప్రయోజనం లేదని ఏఐబీఓసీ అభిప్రాయపడింది. ఎల్‌ఐసీ.. ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా భారత్‌ ప్రభుత్వం 3.5 శాతం వాటా లేదా 22.13 కోట్ల ఈక్విటీ షేర్లను విక్రయిస్తున్నది. మే 2న యాంకర్‌ బుకింగ్‌ నుంచి ఇప్పటికే రూ.5,600 కోట్లకు పైగా వసూలు చేశారు. 4వ తేదీన ప్రారంభమైన ఎల్‌ఐసీ ఐపీఓ దరఖాస్తు ప్రక్రియ.. 9వ తేదీతో ముగుస్తుంది. కంపెనీ మంచి మూలధనం పొందినట్టు ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ చెప్పుకొచ్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement