Saturday, March 16, 2024

త్వరలో విశాఖ రైల్వే జోన్ భవనాల నిర్మాణం.. వెల్లడించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖ రైల్వే జోన్ పనులు వేగవంతం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్‌లో జోనల్ భవనాల కార్యాలయాల నిర్మాణం కోసం కేంద్రం రూ. 10 కోట్లు కేటాయించింది. గత ఏడాది ఇందుకోసం రూ. 40 లక్షలు మాత్రమే కేటాయింపులు జరిగాయి. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌, రాయగడ డివిజన్‌కు కలిపి బడ్జెట్‌లో రూ. 10 కోట్లు కేటాయించినట్టు రైల్వే పింక్ బుక్‌లో పేర్కొంది. మొత్తం రూ. 170 కోట్ల అంచనాతో కొత్త జోన్‌ ఏర్పాటుకు 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన విషయం తెలిసింది. 2021-22 బడ్జెట్‌లో రూ. 8 లక్షల ఖర్చు చేయగా, 2022-23లో రూ. 40 లక్షలు కేటాయించింది. జోనల్ హెడ్‌క్వార్టర్స్ భవనాలకు తగిన స్థలం ఖరారైందని, ఈ మధ్యనే తాను ఆ స్థలాన్ని స్వయంగా పరిశీలించానని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. శుక్రవారం న్యూఢిల్లీలోని రైల్ భవన్‌లో కేంద్ర మంత్రి తెలుగు మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైల్వే ప్రాజెక్టులకు రూ. 12 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేశామని ఆయన తెలిపారు. బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 8,406 కోట్ల మేర కేటాయింపులు జరిగాయని గణాంకాలు వెల్లడించారు. 2009-2014 మధ్యకాలంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మొత్తం కేటాయింపులు కేవలం రూ. 886 కోట్లు మాత్రమేనని, కానీ ఈ ఒక్క ఏడాదికే ఇంత పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిపామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిపిన కేటాయింపుల్లో రైల్వే లైన్ డబ్లింగ్, ట్రిప్లింగ్ ప్రాజెక్టులతో పాటు కొత్త ప్రాజెక్టులు కూడా ఉన్నాయని చెప్పారు.

- Advertisement -

అలాగే చాలా చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ)లు, రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ)లు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, మోడల్ రైల్వే స్టేషన్లు వంటి అనేక ప్రాజెక్టులు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. వన్ డిస్ట్రిక్ట్ – వన్ ప్రొడక్ట్ పేరుతో జియో ట్యాగింగ్ చేసిన వస్తువులతో పాటు రోజువారీ వస్తువులు రైల్వే స్టేషన్లలో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014లో పొందుపర్చిన కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి కేంద్ర మంత్రిని ప్రశ్నించగా.. చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉందని, ఆ మేరకు పరిశీలించి ప్రత్యామ్నాయంగా రైల్వే ఓవర్హాలింగ్ ఫ్యాక్టరీని మంజూరు చేశామని వివరించారు. త్వరలోనే టెండర్లను పిలిచి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

రానున్నది ‘వందే’ యుగం

మరోవైపు వందే భారత్ రైళ్ల తరహాలో ‘వందే మెట్రో’ రైళ్లు రాబోతున్నాయని కేంద్ర మంత్రి వివరించారు. 60-70 కి.మీ దూరం కల్గిన రెండు పట్టణాలు లేదా నగరాల మధ్య వేగవంతమైన రాకపోకలు సాగించేలా ఈ వందే మెట్రో రైళ్లు ఉంటాయని తెలిపారు. వందే భారత్‌కు భిన్నంగా వందే మెట్రో వ్యవస్థ ఉంటుందని, యూరప్ దేశాల్లో ఎక్కువ దూరం లేని రెండు నగరాల మధ్య వేగవంతమైన రాకపోకలకు ఈ తరహా వ్యవస్థ అందుబాటులో ఉందని తెలిపారు. తాను ఈ మధ్య యూరప్ దేశాల్లో పర్యటించినప్పుడు ఇలాంటి రైళ్లలో ప్రయాణించానని, వందే భారత్ రైళ్లు వాటి కంటే ఏమాత్రం తీసిపోవని, ఇంకా చెప్పాలంటే మరింత మెరుగ్గా ఉన్నాయని అన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం నగరాల మధ్య పరుగులు తీస్తున్న వందే భారత్ రైలుకు మంచి స్పందన కనిపిస్తోందని, ప్రతిరోజూ అన్ని సీట్లూ నిండుతున్నాయని తెలిపారు. త్వరలో మరికొన్ని వందే భారత్ రైళ్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. వారం రోజులకు ఒక వందే భారత్ రైలుకు అవసరమైన భోగీల ఉత్పత్తి జరుగుతోందని అన్నారు. వందే మెట్రో రైళ్లను తొలి దశలో విస్తృతంగా పరీక్షించి, పరిశీలించిన తర్వాతనే అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. వందే భారత్ రైళ్లను 2017లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని, చాలాసార్లు పరీక్షించిన తర్వాతనే భారత్‌లో రైళ్ల తయారీ, వినియోగం ప్రారంభమైందని అన్నారు. త్వరలో గ్రీన్ హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనల్లో ఉన్నామని రైల్వే మంత్రి తెలిపారు. ఈ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement