Sunday, May 5, 2024

జియోమార్ట్ నుంచి వెయ్యిమంది అవుట్‌.. తొల‌గింపులు షురూ

భారత వ్యాపార దిగ్గజం, రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీకి చెందిన జియోమార్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. కాస్ట్ కట్టింగ్లో భాగంగా 1,000 మంది ఉద్యోగులను తొలగించింది. రానున్న రోజుల్లో మరో 9,900 మంది సిబ్బందిని తొలగించే యోచనలో ఉంది. ఖర్చును తగ్గించుకుని లాభాలను పెంచుకోవాలనే లక్ష్యంతోనే సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 150కిపైగా ఫుల్ ఫిల్ మెంట్ కేంద్రాల్లో సగానికిపైగా మూసివేయాలని రిలయన్స్ భావిస్తోంది. ఈ కేంద్రాలు దేశంలోని ఇతర రిటైల్ స్టోర్లకు సరకులు సరఫరా చేస్తుంటాయి. వీటి మూసివేతతో సంస్థపై భారం తగ్గనుంది.

జర్మనీ రిటైల్ వ్యాపార సంస్థ మెట్రో ఏజీ భారత్ లో నిర్వహిస్తున్న క్యాష్ అండ్ క్యారీ వ్యాపార కార్యకలాపాలను రిలయన్స్ ఇటీవలే 344 మిలియన్ డాలర్లు(రూ. 2,850 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది. దీంతో ఆ సంస్థలోని 3,500 సిబ్బంది కూడా రిలయన్స్ సంస్థ కిందకు వచ్చారు. వీరి రాకతో జియోమార్ట్ లో వేలాది మంది సిబ్బంది ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. ఖర్చు తగ్గించుకునేందుకు 500 మంది ఎగ్జిక్యూటివ్ లు సహా వేల మంది ఉద్యోగులను రాజీనామా చేయాలని రిలయన్స్ జియోమార్ట్ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి 1,000 మంది సిబ్బందినే తొలగించినప్పటకీ, భవిష్యత్తులో దాదాపు 10 వేల మంది ఉద్యోగులను విధుల నుంచి తప్పించే అవకాశముంది.

ఇప్పటికే వేల మంది ఉద్యోగులకు తమ పనితీరు మెరగుపరుచుకోవాలని జియోమార్ట్ నోటీసులు పంపినట్లు అందులో పనిచేసే ఒకరు తెలిపారు. కొంతమందికి సాలరీలో కోత కూడా విధించారని పేర్కొన్నారు. అలాగే సేల్స్ ఉద్యోగులను వేరిబుల్ పే స్ట్రక్చర్ కు పరిమితం చేశారని తెలిపారు. అమెజాన్ , మెటా, మైక్రోసాఫ్ట్ సహా దిగ్గజ ఐటీ సంస్థలు లేఆఫ్స్ బాటపట్టిన సంగతి తెలిసిందే. ఈ సంస్థలు ఇప్పటికే వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. అయితే భారత్ కు చెందిన రిటైల్ సంస్థ కూడా ఇప్పుడు ఈ జాబితాలో చేరింది. రిలయన్స్ జియో మార్ట్ ఏకంగా 11 వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధం కావడం చర్చనీయాంశమైంది. రిలయన్స్ బాటలో భారత్ లోని ఇతర సంస్థలు కూడా నడుస్తాయో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement