Friday, May 3, 2024

తెలంగాణ స్పీకర్ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌: తెలంగాణ శాసన సభ, మండలి ఈనెల 15 నుంచి కొలువుదీరనుంది. అయితే ఈసారి సమావేశాల సందర్భంగా కొన్ని ఖచ్చితమైన నిబంధనలను అమలు చేస్తున్నట్టు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. అందులో భాగంగానే సభకు వచ్చే ప్రతి సభ్యుడూ తప్పని సరిగా మాస్క్‌ధరించాల్సిందేనని ఆదేశించారు. శాసన సభ్యులు, సిబ్బంది క్షేమం కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. సభ్యులు ఆరోగ్య రక్షణ కోసం ర్యాపిడ్‌ టెస్ట్‌లు చేస్తామని అన్నారు. సిబ్బంది కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలన్నారు. శాసనసభ, శాసన మండలి సమావేశాల నేపధ్యంలో స్పీకర్‌ పోచారం శుక్రవారం ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ మండలి, అసెంబ్లీ సమావేశాలకు అందరూ సహకరించాలని అన్నారు. సమావేశాలు ఎలాంటి అవాంతరాలు లేకుండా సజావుగా జరగానికి అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సభలో సభ్యులు స్వేచ్చగా పాల్గొనేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌, మండలి చీఫ్‌ విప్‌ బోడకంటి వెంకటేశ్వర్లు, అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement