Thursday, April 25, 2024

పాలమూరు-రంగారెడ్డి పనులకు ‘సుప్రీం’ గ్రీన్‌ సిగ్నల్‌..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : గత కొన్నేళ్ళుగా న్యాయపరమైన చిక్కులతో ముందుకు సాగని పాలమూరు-రంగారెడ్డి సుజల శ్రవంతి ఎత్తిపోతల పథకానికి ఎట్టకేలకు శుక్రవారం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. నిబంధనలను అమలు చేస్తూ నిరభ్యంతరంగా పనులు చేపట్టుకోవచ్చునని సూచించింది. ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టులో 7.15 టీ-ఎంసీల నీటి వినియోగం వరకు పనులు కొనసాగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే, ఈ ప్రాజెక్టు ద్వారా కేటాయించిన నీటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించుకుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతుల ప్రకారం తెలంగాణ వాటాగా 7.15 టీఎంసీల నీటిని ఉపయోగించుకోవటానికి సర్వోన్నత న్యాయస్థానం కొన్ని నిబంధనలతో మార్గదర్శకాలను ఇచ్చింది. ఎక్కడా కోర్టు దిక్కరణకు ఆస్కారం లేకుండా పనులు ప్రారంభించాలని, అందుకు ప్రభుత్వం అమలు చేయబోతున్న ప్రణాళికను సమర్పించాలని సుప్రీంకోర్టు సూచించింది.

- Advertisement -

ప్రజలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనకుండా ఉండేందుకే ఈ నిర్నయం తీసుకున్నట్లు కోర్టు స్పష్టం చేసింది. ఉన్నతమైన లోంతో తలపెట్టిన ఈ ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదన్న ఉద్దేశ్యంతో ఈ అవకాశం కల్పిస్తున్నట్లు జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పును వెలువరించింది. ఈ కేసులో మెరిట్స్‌ ఆధారంగానే తగిన నిర్ణయాలు ఉంటాయని ధర్మాసనం సూచించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారని జాతీయ హరిత టైబ్యునల్‌ విధించిన రూ.500 కోట్ల జరిమానాపై మాత్రం అత్యున్నత న్యాయస్థానంలోని ధర్మాసనం స్టే విధించింది. అయితే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) జరిమానా విధిస్తూ.. ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం సవాల్‌ చేసింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు విచారణ జరిపింది. తాజాగా ప్రజల తాగునీటి అవసరాలకు అవసరమయ్యే విధంగా 7.15 టీ-ఎంసీల నీటి వరకు మాత్రమే పనులకు అనుమతిని ఇచ్చింది.

ఆరు వారాల్లో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలుకు ఆదేశం..

ఈ కేసులో ఉన్న ప్రతివాదులందరికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆరు వారాల్లో ప్రతివాదులు అంతా.. కౌంటర్‌ అఫిడవిట్‌లు దాఖలు చేయాలని.. ఆ తర్వాత ఆరు వారాల్లో వాటికి సమాధానంగా రిజాయిండర్‌లు దాఖలు చేయాలని పిటిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణ ఆగస్టులో చేపట్టనున్నట్లు తెలిపింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి గత నెలలో సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ వాదనలను వినాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. అప్పుడు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, జస్టిస్‌ హిమాకోహ్లితో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పును రెండు వారాలకు వాయిదా వేసింది. ఇంకా ఆ తీర్పు కాకముందనే తాజాగా సుప్రీంకోర్టు పాలమూరు-రంగారెడ్డికి అనుమతులు ఇచ్చింది. వచ్చే నెలలో మరోసారి వాదనలు విన్న తర్వాత ‘సుప్రీం’ తుది నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement