Monday, May 6, 2024

దేశంలో సంక్షోభం..చూస్తూ కూర్చోలేం: సుప్రీం కోర్టు

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోందని..ఇలాంటి సంక్షోభ సమయంలో తాము నోరు మూసుకుని కూర్చోలేమని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది. కరోనా సంక్షోభంపై స్పందించే హక్కు అన్ని రాష్ట్రాల్లోని హైకోర్టులకు ఉందని, ఆయా హైకోర్టుల చర్యలను తాము అనుసంధానం చేసుకుంటూ పోతామని స్పష్టం చేసింది. ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులకు ఉండే అధికారాన్ని తాము నివారించలేమని, కరోనా పరిస్థితులపై ఆయా హైకోర్టులకు తమ వంతు సహకారం అందిస్తామని స్పష్టం చేసింది. హైకోర్టులు పరిష్కరించలేని విషయాల్లో తాము సాయం చేస్తామంది. కాగా, అంతకుముందు సుమోటోగా కేసు విచారణను చేపట్టిన మాజీ సీజేఐ ఎస్ ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. కరోనాపై జాతీయస్థాయి ప్రణాళికను వెల్లడించాల్సిందిగా ఆదేశించింది.

ఇక కరోనాను పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చేందుకు సైన్యం, పారామిలటరీ బలగాలు, రైల్వేలకు చెందిన వైద్య వనరులను వాడుకునే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికుందా? అని జస్టిస్ రవీంద్ర భట్ ప్రశ్నించారు. క్వారంటైన్, వ్యాక్సినేషన్, బెడ్ల కోసం ప్రస్తుతం ఆర్మీ సాయం తీసుకోవచ్చని, దీనిపై కేంద్ర ప్రణాళిక ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇక కరోనా టీకాలపై వివిధ సంస్థలు విధించిన ధరలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. టీకాల ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేంటని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో అందరికీ వ్యాక్సిన్లు వేయడమే మేలైన మార్గమని వ్యాఖ్యానించారు. వ్యాక్సిన్ ధరల్లో తేడాలు ఎందుకు ఉన్నాయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సుప్రీం..దీనిపై ప్రభుత్వం ఏం చేస్తోందని అసహనం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement