Wednesday, April 24, 2024

ట్రిమ్స్ ఆస్పత్రికి హైకోర్టు నోటీసు

కరోనా బారిన పడిన బాధితులకు ఆస్పత్రిలో అందుతున్న ట్రీట్‌ మెంట్ వివరాలను తెలియజేయాలని టీమ్స్ ఆస్పత్రి యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయిన తర్వాత గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో పది రోజుల క్రితం చేరిన ఇద్దరి పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పటికీ తెలియడంలేదంటూ వారి తరఫున కిషోర్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. తమ కుటుంబ సభ్యులు ఈ నెల 17 న కరోనాతో టీమ్స్ ఆస్పత్రిలో చేరారని, నాగరాజు, నర్సింరావు ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పిటీషన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్‌‌ ను మంగళవారం విచారించిన హైకోర్టు ఆస్పత్రి యాజమాన్యానికి, ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

పేషెంట్ల ఆరోగ్య పరిస్థితి, వారికి అందుతున్న ట్రీట్‌ మెంట్ గురించి బంధువులకు కూడా తెలియాల్సిన అవసరం ఉందని, రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు లోబడి, మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం తెలియజేయాలని పిటిషనర్ కోరారు. ఆస్పత్రి వార్డులోకి వెళ్ళే అవకాశం లేదని, వారితో ఫోన్‌ లో మాట్లాడే అవకాశం కూడా లేదని అన్నారు. కనీసం ఆస్పత్రి డాక్టర్లు, వైద్య సిబ్బంది నుంచి అడిగి తెలుసుకుందామని చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని కిషోర్ పేర్కొన్నారు. అందువల్లనే యాజమాన్యం నుంచి తాజా వివరాలను తెలుసుకోవాలనుకుంటున్నామని పిటిషన్‌ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు బెంచ్ తక్షణం పేషెంట్ల బంధువులు కోరిన సమాచారాన్ని ఇవ్వాలని, రిపోర్టులను కోర్టుకు సమర్పించాలని టిమ్స్ నిర్వాహకులను ఆదేశించింది. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement