Sunday, April 28, 2024

లోన్ యాప్‌ల అరాచకాలను అణిచి వేయండి.. రాజ్యసభ జీరో అవర్‌లో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తక్షణ రుణం పేరుతో ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్‌లు సాగిస్తున్న అరాచకాలు, వేధింపులు, బలవంతపు వసూళ్లకు అణచివేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ జీరో అవర్‌లో సోమవారం ఆయన ఈ అంశాన్ని లేవనెత్తారు. అర్థిక అవసరాలతో ఇబ్బందులు పడే అమాయకులకు తక్షణమే రుణం ఇస్తామంటూ లోన్‌ యాప్‌లు ఆకర్షిస్తున్నాయని, లోన్‌ కోసం ఈ యాప్‌ ద్వారా రిక్వెస్ట్‌ చేసిన వారి ఫోన్‌ నుంచి వ్యక్తిగత సమాచారం, ఫోన్ నెంబర్లు, ఫోటోలు, వీడియోలను సేకరించి వారికి రుణం మంజూరు చేస్తున్నారని తెలిపారు.

తీసుకున్న రుణం మొత్తం తిరిగి చెల్లించిన తర్వాత కూడా అధిక మొత్తంలో వడ్డీ, ఇతర చార్జీలు బకాయిపడినట్లుగా చూపిస్తున్నారని అన్నారు. బకాయిలు చెల్లించడానికి నిరాకరించే రుణగ్రహీతలను బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బలవంతపు వసూళ్ళకు పాల్పడటం ఈ లోన్‌ యాప్‌లు అవలంభించే విధానమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ లోన్‌ యాప్‌లు అత్యధికంగా చైనా నుంచి తమ కార్యకలాపాలు సాగిస్తున్నాయని అన్నారు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆమోదం లేకుండానే ఈ లోన్‌ యాప్‌లు యధేచ్చగా తమ అక్రమ ఫైనాన్స్‌ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు.

- Advertisement -

ఆంధ్రప్రదేశ్‌లో సైతం ఇలాంటి లోన్‌ యాప్‌ల బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌, నిర్బంధ వసూళ్ళ కారణంగా రుణగ్రహీతలు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలు వెలుగు చూడటంతో ప్రభుత్వం వెంటనే లోన్‌ యాప్‌ ఏజెంట్లను అరెస్ట్‌ చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుందని వివరించారు. ఇలాంటి సైబర్‌ నేరాల విషయంలో తక్షణమే స్పందించేందుకు వీలుగా స్టాండర్డ్‌ ఆపరేటింగ్‌ ప్రొసీజర్‌ (ఎస్‌ఓపీ)ని రూపొందించిందని అన్నారు. అలాగే ఇన్‌స్టాంట్‌ లోన్‌ యాప్‌లను అణచివేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు సెంట్రల్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (సెర్ట్‌)తో కలిసి పని చేస్తోందని విజయసాయి రెడ్డి తెలిపారు.

అయినప్పటికీ ఈ లోన్‌ యాప్‌ల కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయని, అమాయక ప్రజల జీవితాలతో అవి చెలగాటం ఆడుతున్నాయని తెలిపారు. వేధింపులు, బెదిరింపులతో రుణగ్రహీతలను తీవ్రమైన మనో వ్యధకు గురి చేస్తూ అనేక సందర్భాలలో వారు ఆత్మహత్యలకు పాల్పడేలా పురిగొల్పుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఐటీ శాఖ మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌లో వాటిని నిషేధించాలని సూచించారు. అలాంటి యాప్‌లను డెవలప్‌ చేసే వారిని, వాటిని ప్రమోట్‌ చేసే వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. ఫోన్‌ డేటా ప్రైవసీకి సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement