హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో : విద్యాభివృద్ధితో పాటు పాఠశాలల మౌలిక సదుపాయాల కల్పనలో ఇప్పటికే దేశంలో నెంబర్ వన్ స్థానానికి చేరుకున్న తెలంగాణాలో ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. దశల వారీగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్లాంట్లను నిలకొల్పాలని నిర్ణయించింది. విద్యుత్ బిల్లులు చెల్లించలేక పేరుకుపోయిన బకాయలతో సతమతమవుతున్న పాఠశాలలకు ఇకనుంచి ఉపశమనం కలుగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,980 ప్రాథమిక, 7,688 మాధ్యమిక, 12,932 ఉన్నత పాఠశాలలున్నాయి.
తొలి ప్రాధాన్యతగా ప్రాథమిక పాఠశాలల నుంచి సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పేందుకు ప్రభుత్వం మార్గదర్శాలు ఇచ్చింది. తెలంగాణ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (రెడ్కో), విద్యాశాఖ సంయుక్త భాగస్వమ్యంతో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనుంది. ఒక్కో స్కూల్పై సోలార్ ప్లాంటును నెలకొల్పేందుకు తొలుత రూ.50వేలు విడుదల చేయనున్నారు. ఇప్పటికే 9,123 పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు గానూ ప్రభుత్వం రూ.3,497 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను ఉపయోగిస్తూ, రాష్ట్రంలోని 500లకు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో మార్చి నాటికి సౌర విద్యుత్ ప్లాంట్లను నెలకొల్పనున్నారు.
ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం, త్వరలోనే ప్రయోగాత్మక పాఠశాలల్లో సౌర విద్యుత్తు అందుబాటు-లోకి రానుంది. 12 జిల్లాల్లో రూ.32 కోట్లతో 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే.. తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిఎస్ఆర్ఇడిసిఓ) అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు 100కి పైగా ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేశారు. మరో 453 పాఠశాలలకు వర్క్ ఆర్డర్లు జారీ చేశారు. ప్రాజెక్ట్ మొదటి దశలో మేము సుమారు 500 ప్రభుత్వ పాఠశాలల్లో సోలార్ ప్యానెల్లను ఏర్పాటు చేస్తారు. రాబోయే కొద్ది నెలల్లో మొత్తం 1,521 పాఠశాలల పనిని పూర్తి చేయాలని భావిస్తున్నారు.
గత ఏడాది సెప్టెంబరులోనే ప్రభుత్వం సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు కు టె-ండర్లను ఆహ్వానించింది. 11 విక్రేత సంస్థలను ఖరారు చేసింది. ఎంపికైన విక్రేతలు పాఠశాలల్లో 2 కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్ల రూఫ్టాప్ సోలార్ సిస్టమ్లను ఏర్పాటు చేస్తున్నారు. 200 మందికి పైగా నమోదు చేసుకున్న పాఠశాలలను సోలార్ ప్యానెళ్ల ఏర్పాటుకు ఎంపిక చేశారు. ఎంపికైన 1,521 ప్రభుత్వ పాఠశాలల్లో 916 సదరన్ పవర్ డిస్ట్రిబ్య్రూషన్ కంపెనీ లిమిటెడ్ కింద, 605 నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్య్రూషన్ కంపెనీ లిమిటెడ్ కింద ఉన్నాయి.
సోలార్ ప్యానెల్స్ను ఏర్పాటు చేయడం వల్ల పాఠశాలల వార్షిక విద్యుత్ బిల్లులు పెద్ద ఎత్తున తగ్గడమే కాకుండా అదనపు విద్యుత్ ఉత్పత్తి, గ్రిడ్కు బదిలీ చేయడం ద్వారా డబ్బు సంపాదించడానికి కూడా సహాయపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. స్మార్ట్ తరగతులు, పెద్ద సంఖ్యలో కంప్యూటర్ సిస్టమ్లను ఉపయోగించడం వల్ల ప్రభుత్వ పాఠశాలలు ఇంటరాక్టివ్గా మారాయి. దీంతో పాఠశాలలకు కరెంటు- బిల్లులు భారీగా పెరిగాయి. పాఠశాలల్లో అమర్చిన సోలార్ ప్యానెల్స్ వల్ల విద్యుత్ బిల్లు భారం తగ్గుతుంది.