లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నపార్లమెంట్ అభ్యర్థుల ఆరో జాబితాను కాంగ్రెస్ సోమవారం విడుదల చేసింది. ఈ జాబితాలో ఐదుగురు ఎంపీ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. ఇందులో తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రహ్లాద్ గుంజాల్ను రంగంలోకి దించారు. ఇక అజ్మీర్ నుండి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుండి సుదర్శన్ రావత్, భిల్వారా నుండి దామోదర్ గుర్జర్, తిరునెల్వేలి నుండి సి. రాబర్ట్ బ్రూస్ లను కూడా నిలబెట్టింది.
ఇప్పటి వరకు విడుదల చేసిన ఆరు జాబితాల్లో మొత్తం 190 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. ఇందులో భాగంగా తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గాను తొమ్మిది స్థానాలకే అభ్యర్థులను ప్రకటించింది. మరో 8 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కాగా, మార్చి 27న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో తెలంగాణలోని మిగతా 8 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.