Sunday, May 5, 2024

మాంసం ప్రియులకు షాక్‌.. ఆల్‌టైం రికార్డు చికెన్‌ ధర

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కోడి మాంసంతో భోజనాన్ని లొట్టలేసుకుని ఆరగించే మాంసాహార ప్రియులకు చికెన్‌ ధరలు మింగుడుపడడం లేదు. ప్రస్తుతం కోడి ధర కొండెక్కి కూర్చుంది. ఎండలు మండిపోతుండడంతో చికెన్‌ తినే వారి సంఖ్య తగ్గుతుంది, చికెన్‌కు అంతగా డిమాండ్‌ ఉండదులే అనుకుంటే పొరపాటే. రాష్ట్ర వ్యాప్తంగా చికెన్‌ ధరలు భగ్గుమంటున్నాయి. కిలో స్కిన్‌లెస్‌ చికెన్‌ ధర రూ.300 పలుకుతుండడంతో కోడి మాంసం ప్రియులు అవాక్కవుతున్నారు. పది రోజుల కిందటి వరకు కిలో చికెన్‌ రూ.220 నుంచి రూ.240 ఉండగా ఇప్పుడు అది స్కిన్‌ లెస్‌ కిలో రూ.300, విత్‌ స్కిన్‌ రూ.280కి చేరింది. దీంతో ఈ వేసవి చికెన్‌ ప్రియులకు షాకిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం లైవ్‌బర్డ్‌ కు కిలో రూ.180కి విక్రయిస్తున్నారు. అంతకు ముందు ఈ ధర రూ.120గా ఉండేది.

ఏప్రిల్‌ 1నకిలో చికెన్‌ ధరరూ. 154గా ఉంది. వారం కిందట మార్కెట్‌లో స్కిన్‌తో కూడిన చికెన్‌ ధర కిలో రూ.213గా, స్కిన్‌లెస్‌ రూ.243గా ఉండేది. ఇప్పుడు ఆధర రూ.300కు చేరింది. మటన్‌ ధరతో పోలిస్తే ఆ ధరలో 25శాతం ధరకే కిలో చికెన్‌ వస్తుండడంతో మాంసాహారులు ఎక్కువగా చికెన్‌ తినేందుకే ఇష్టపడతారు. అయితే చికెన్‌ ధరలు పెరగడంతో కొనేందుకు వెనకాముందు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక ఇంటికి బందువులు వస్తే చికెన్‌ కొనాలంటే రూ.1000దాకా ఖర్చు చేయాల్సి వస్తోందని వినియోగదారులు వాపోతున్నారు. వేసవిలో విపరీతమైన ఎండలకు బయటకు వెళ్లాలంటేనే మనుషులు కూడా భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రోజూ దాదాపు 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో కోళ్లు ఎండ వేడికి ప్రాణాలు వదులుతున్నాయి.

- Advertisement -

సాధారణంగా వేసవి కాలంలో కోళ్లఫారాల్లో చికెన్‌ బ్యాచ్‌లను పెంపకందారులు తగ్గిస్తుంటారు. అదేసమయంలో ఎండలు విపరీతంగా పెరగడంతోపాటు వడగాలులకు కోళ్లు మృత్యువాతపడుతుండడంతో చికెన్‌ ధరలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. సాధారణం గా వేసవిలో 40 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితే బ్రాయిలర్‌ కోళ్లు ఎండవేడిని తట్టుకోలేవు. కోళ్ల షెడ్లపై స్ప్రింకర్లతో రోజుకు 3సార్లు చల్లబరచకపోతే ఎండ వేడికి చనిపోతాయి. ఈ పరిస్థితుల్లో స్ప్రింకర్లతోపాటు కూలర్లు పెట్టిమరీ కోళ్ల ఫామ్‌ నిర్వాహకులు షెడ్లలో చల్లదనాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

అదే సమయంలో కరోనా మొదటి దశ తర్వాత కోళ్ల దాణాధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కోడికి వేసే దాణాలో ప్కరధానంగా సోయ, మొక్కజొన్న ప్రధానమైనది. కరోనాకు ముందు కిలో సోయా రూ.35కు లభించేది. ఇప్పుడు కిలో రూ.105కు చేరింది. ఇక రూ.13కు కిలో లభించే మొక్కజొన్న దాణా ధర ఇప్పుడు రూ.40కి చేరింది. దీంతో కోళ్ల పెంపకంలో ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయింది. ఈ పరిస్థితుల్లో పెరిగి న దాణా ఖర్చులు, విపరీతమైన ఎండవేడికి కోళ్లు మృత్యువాతపడడం, ఎండవేడి నుంచి కోళ్లను కాపాడేందుకు కూలర్లు, ఏసీలు, స్ప్రింక్లర్లు వంటి ఉపకరణాల వినియోగంతో చికెన్‌ ఉత్పత్తి ఖర్చు పెరిగిపోయి చికెన్‌ ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి.

మరో వైపు పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో చికెన్‌కు భారీగా డిమాండ్‌ ఉంది. ఈ తరుణంలో చికెన్‌ కిలో ధర రూ.270 నుంచి రూ.300 వరకు పెరిగింది. పది రోజులుగా 45డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో రోజుకు మూడు, నాలుగు కోళ్లు మృత్యువాతపడుతున్నాయని, దీంతో చికెన్‌ దిగుబడి తగ్గుతోందని కోళ్లఫామ్‌ నిర్వాహకులు చెబుతున్నారు. రానున్న పది, పదిహేను రోజుల వరకు చికెన్‌ ధరలు తగ్గుముఖం పట్టే అవకాశం లేదని, పైగా ఇంకా పెరిగే అవకాశం ఉందని ఫామ్‌ నిర్వహకులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement