Tuesday, May 14, 2024

రిఫరీనే కొట్టిన సతేందర్.. తీవ్రంగా పరిగణించిన డబ్ల్యూఎఫ్‌ఐ

న్యూఢిల్లి : మ్యాచ్‌ రిఫరీపై అనుచితంగా ప్రవర్తించినందుకు గాను భారత్‌ రెజ్లర్‌ సతేందర్‌ మాలిక్‌పై రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) జీవిత కాలం నిషేధం విధించింది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌ హామ్‌ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్‌వెల్త్‌ క్రీడలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన ట్రయల్‌ ఢిల్లిలో నిర్వహిస్తున్నారు. మంగళవారం 125 కేజీల విభాగంలో ఫైనల్‌ మ్యాచ్‌ను నిర్వహించారు. ఈ పోటీలో మోహిత్‌ చేతిలో సర్వీసెస్‌ జట్టుకు ఆడుతున్న సతేందర్‌ మాలిక్‌ ఓడిపోయాడు. దీంతో కామన్‌ వెల్త్‌ క్రీడలకు అర్హత సాధించలేకపోయాడు. ఓ దశలో సతేందర్‌ సింగ్‌ 3-0తో ఆధిక్యంలో ఉన్నాడు. ప్రత్యర్థి మోహిత్‌ తన బలంతో సతేందర్‌ను మ్యాట్‌ బయటికి నెట్టేశాడు. అయినప్పటికీ మోహిత్‌కు రిఫరీ పాయింట్‌ మాత్రమే కేటాయించాడు. దాంతో మోహిత్‌ రివ్యూ కోరాడు. జ్యూరీ సభ్యుడిగా ఉన్న సత్యదేవ్‌ మాలిక్‌ స్పందిస్తూ.. సతేందర్‌ మాలిక్‌ తాను ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో నిర్ణయం తీసుకోలేనని, జ్యూరీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపాడు. దీంతో రివ్యూ బాధ్యత సీనియర్‌ రిఫరీ జగ్బీర్‌ సింగ్‌కు అప్పగించారు.

రివ్యూ తరువాత మోహిత్కు ఏకంగా మూడు పాయింట్లు కేటాయించాడు. ఓడిపోతాడనుకున్న మోహిత్‌ కాస్తా 3-3తో మళ్లి రేసులోకి వచ్చాడు. దీంతో సతేందర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. నేరుగా మ్యాట్‌పైకి వెళ్లిన సతేందర్‌.. జగ్బీర్‌తో గొడవకు దిగాడు. ఆ తరువాత అతని పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ.. ముఖంపై పంచ్‌ ఇచ్చాడు. ఆ దెబ్బకు జగ్బీర్‌ సింగ్‌ మ్యాట్‌పై పడిపోయాడు. ఈ ఘటనతో ఇండోర్‌ స్టేడియంలో గందరగోళం నెలకొంది. డబ్ల్యూఎఫ్‌ఐ అధికారులు సతేందర్‌ను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు భూషణ్‌ శరత్‌ చూస్తుండగానే ఈ ఘటన జరిగింది. రిఫరీపై దాడికి పాల్పడిన సతేందర్‌ మాలిక్‌పై జీవిత కాల నిషేధం విధిస్తున్నట్టు డబ్ల్యూఎఫ్‌ఐ సహాయ కార్యదర్శి వినోద్‌ తోమర్‌ వెంటనే ప్రకటించడం గమనార్హం.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement