Thursday, May 2, 2024

Delhi | జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి.. కేంద్రానికి బీసీ సంఘాల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : జనాభా ప్రకారం బీసీలకు స్థానిక సంస్థలు, విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు, జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కేంద్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఆయన బీసీ సంఘం నేతలతో కలిసి మంగళవారం న్యూఢిల్లీలో కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌తో భేటీ అయ్యారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. రాజ్యాంగ సవరణ చేయాలని, కేంద్ర విద్య, ఉద్యోగ రిజర్వేషన్లను వెనుకబడిన వర్గాల జనాభా ప్రకారం 27 శాతం నుంచి 56 శాతానికి పెంచాలని కోరారు. తమ ప్రభుత్వం కులాల వారీగా జనగణన చేసేందుకు సుముఖంగా ఉందని, సంబంధిత అధికారులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని భూపేంద్ర యాదవ్ హామీ ఇచ్చినట్టు ఆర్. కృష్ణయ్య వెల్లడించారు. దీనిపై ప్రధానమంత్రితో పాటు ఇతర కేంద్ మంత్రులతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన భరోసా ఇచ్చినట్టు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement