Sunday, May 19, 2024

ఇతర కారిడార్‌ నుంచి వచ్చే పులులకు రెడ్‌ కార్పెట్‌.. తెలంగాణ సర్కారు, అటవీ శాఖ భేష్‌ అంటూ కితాబు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : వన్య ప్రాణులు కోసం తెలంగాణ అటవీశాఖ చేస్తున్న ప్రయత్నాలు బాగున్నాయని, ఈ చర్యతో ఇతర కారిడార్‌ నుంచి వచ్చే పులులకు రెడ్‌ కార్పెట్‌ పరుస్తున్నట్టేనని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ బృందం కొనియాడింది. పులులు, ఇతర వన్య ప్రాణుల సంరక్షణ కోసం అటవీ రక్షణ చర్యలు, గడ్డి క్షేత్రాల పెంపు, నీటి వసతి నిర్వహణ ఇక్కడ బాగుందని కితాబునిచ్చింది. ఈ మేరకు సోమవారం నాడు అరణ్య భవన్‌లో పిిసిసిఎస్‌ మరియు హెచ్‌ఓఓఎఫ్‌ ఆర్‌ఎం డోబ్రియాల్తో సమావేశమైన జాతీయ పులుల సంరక్షణ అథారిటీ బృందం సభ్యులు దేరేంద్ర సుమన్‌, నితిన్‌ కకోద్కర్‌లు
అటవీశాఖను ప్రశంసించారు.

- Advertisement -

తెలంగాణలో వారం రోజుల పాటు పర్యటించింది. ముఖ్యంగా అమ్రాబాద్‌, కవ్వాల్‌ పులుల అభయారణ్యంలను క్షేత్ర స్థాయిలో ఈ టీమ్‌ పరిశీలించింది. దేశ వ్యాప్తంగా ఉన్న టైగర్‌ రిజర్వుల పనితీరు నిర్వహణపై ప్రతీ నాలుగేళ్లకోసారి జాతీయ అథారిటీ మూల్యాంకన బృందంతో మధింపు చేస్తున్నది. దీనిలో భాగంగా తెలంగాణలో ఉన్న రెండు టైగర్‌ రిజర్వ్‌ లలో ఈ బృందం పర్యటించి అటవీ శాఖ తీసుకుంటున్న చర్యలను పరిశీలించింది. ముఖ్యంగా అమ్రాబాద్‌ , కవ్వాల్‌ టైగర్‌ రిజర్వ్‌ ల నిర్వహణ జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్బుతంగా ఉందని పేర్కొంది.

ఇందులో భాగంగా తెలంగాణ టైగర్‌ రిజర్వ్‌ల నిర్వహణ జాతీయ స్థాయి ప్రమాణాలతో అద్బుతంగా ఉందని జాతీయ పులుల సంరక్షణ అథారిటీ (ఎన్‌టిసిఎ)కి చెందిన బృందం అభిపాయపడింది. ఇటీవల పెరిగిన పులులు కదలికలను అందుకు ఉదాహరణగా చెప్పారు. మహారాష్ట్రలో ఉన్న తడోబా, తిప్పేశ్వర్‌ అభయారణ్యంలలో పులుల జనాభా పెరిగి ఒత్తిడి ఉందని అవి తెలంగాణలోని కవ్వాల్‌కు వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు అనువైన వాతావరణం ప్రస్తుతం ఉందని అన్నారు. అటవీ అవాసాల పునరుద్దరణలో భాగంగా కోర్‌ ఏరియాలో ఉన్న గ్రామాల తరలింపు శుభ సూచకం అని పేర్కొన్నారు. మిగతా గ్రామాల తరలింపు ప్రక్రియను వేగవంతం చేయాలని వారు సూచించారు.

అలాగే కారిడార్‌లో ఉన్న మిగతా ప్రాంతాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియాల్లో తునికాకు సేకరణను నియంత్రించాలని ఈ బృందం సూచించింది. రెండు రిజర్వుల్లోనూ సిబ్బంది యువ అధికారుల బృందం బాగా పని చేస్తున్నారని , ఇదే తరహా ఉత్సాహాన్ని కొనసాగించాలని సూచించారు. పులుల సంరక్షణ కోసం ప్రత్యేక టైగర్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ఏర్పాటు , మరిన్ని బేస్‌ క్యాంపుల ఏర్పాటును పరిశీలించాలని చేసిన ప్రతిపాదనకు పిసిసిఎఫ్‌ వెంటనే స్పందించి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తామని చెప్పారు. పులుల అభయారణ్యంల సమర్ధ నిర్వహణ కోసం మరింతగా కంపా నిధుల వినియోగానికి మద్దతు ఇవ్వాలని ఈ సందర్బంగా పిసిసిఎఫ్‌ అభ్యర్థించారు. ఈ విషయాన్ని కేంద్ర పరిశీలనకు తీసుకువెళ్తామని బృందం హామీ ఇచ్చింది. ఈ సమావేశంలో పిసిసిఎఫ్‌ (కాంపా) లోకేష్‌ జైస్వాల్‌, కవ్వాల్‌ , అమ్రాబాద్‌ ఫీల్డ్‌ డైరెక్టర్‌ వినోద్‌ కుమార్‌, క్షితిజ, అటవీశాఖ ఓఎస్‌డి ( వైల్డ్‌ లైఫ్‌ ) శంకరన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement