Sunday, April 28, 2024

ఐదేళ్లలో పెట్రోల్‌కు స్వస్తి, ప్రత్యామ్నాయ ఇంధనంగా ఇథనాల్‌.. అందుబాటులోకి గ్రీన్‌ హైడ్రోజన్‌

వచ్చే ఐదేళ్లలో దేశంలో పెట్రోల్‌ వినియోగం దాదాపు నిలిచిపోతుందని, దానికి ప్రత్యామ్నాయంగా బయో ఇధనాల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వంటి కొత్తతరం ఇంధనం అందుబాటులోకి వస్తుందని కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. మహారాష్ట్రలోని విదర్భ జిల్లాలో బయో ఇథనాల్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ తయారీ పరిశ్రమలు నెలకొల్పామని, త్వరలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలు ఇప్పటికే అందుబాటులోకి, ప్రజలనుంచి పెద్దఎత్తున ఆదరణ లభించిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన ఇథనాల్‌ వంటి ఇంధనాలను విని యోగించుకునే విధంగా కొత్త తరహా వాహనాలను తయారు చేయాలని గత సెప్టెంబర్‌లోనే దేశీయ వాహనాల తయారీ సంస్థలకు సూచించిన విషయాన్ని గుర్తు చేశారు. న్యూఢిల్లిdలో శుక్రవారం జరిగిన ఓ సదస్సులో మాట్లా డుతూ ఆయన ఈ విషయం చెప్పారు. వివిధ వాహనాల్లో సంప్రదాయంగా వాడే ఐసీ ఇంజన్లకు బదులు భవిష్యత్‌లో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ ఇంజన్లను తయారు చేయాలని కోరినట్లు చెప్పారు. బయో ఇధనాల్‌ తయారీ, దానివల్ల కలిగే ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తామని, శిలాజ ఇంధన వినియోగాన్ని మున్ముందు ప్రోత్సహించబోమని చెప్పారు.

ఇథనాల్‌ మిశ్రమ పెట్రోల్‌ అంటే..

ఎథిల్‌ ఆల్కహాల్‌ను ఇథనాల్‌కు పిలుస్తారు. ఇది సహజసిద్ధంగా లభించే రసాయనిక పదార్థం. కిరోసిన్‌, గాసోలిన్‌ వంటివాటిలో కన్నా ఇథనాల్‌లో ఆక్టేన్‌ పరిమాణం చాలా ఎక్కువ. అందువల్ల కర్బన ఉద్గారాల విడుదల చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. పెట్రోల్‌, డీజిల్‌కన్నా మెరుగైన ఇంధనంగా ఇది పనిచేస్తుంది. పెట్రోల్‌లో ఇథనాల్‌ను కలిపి వాడటం (ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌) ఇప్పటికే చాలా దేశాల్లో అమల్లో ఉంది. దేశంలోనూ ఈ తరహా ఇంధనం కొన్నిచోట్ల విక్రయిస్తున్నారు. అయితే, భవిష్యత్‌లో ఇదే ప్రధాన ఇంధనంగా వాడుకలోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అయితే, పెట్రోల్‌లో ఇథనాల్‌ను ఎంత పరిమాణంలో కలపాలన్నది ప్రశ్న. వివిధ దేశాల్లో వివిధ పరిమాణాన్ని అనుసరిస్తున్నారు. అయితే, ఇ-90, ఇ-85 పద్ధతిని ప్రామాణికంగా పరిగణిస్తున్నారు. అంటే పెట్రోల్‌లో 10 లేదా 15 శాతం ఇథనాల్‌ను కలుపుతారన్నమాట. ఉదాహరణకు ఇ-90 అంటే, ఒక లీటరు ఇంధనంలో 90 శాతం పెట్రోల్‌ ఉంటే పది శాతం ఇథనాల్‌ను కలుపుతారన్నమాట. ఇలా సిద్ధమైన ఇంధనాన్ని ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌గా పిలుస్తారు. అమెరికా, బ్రెజిల్‌ వ ంటి దేశాల్లో ఏకంగా ఇ-70, ఇ-75 ఇంధనాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. భారత్‌లో 2023 ఏప్రిల్‌ నాటికి ఇ-20 (20 శాతం ఇథనాల్‌ కలిపిన) ఇంధనం అందుబాటులోకి వస్తుందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రయోజనాలెన్నెన్నో…

కర్బన ఉద్గారాలను వెలువరించని ఎలక్ట్రిక్‌ వాహనాలు, హైడ్రోజన్‌ ఆధారిత వాహనాలకన్నా సులువుగా, చౌకగా ఇథనాల్‌ వాడే వాహనాలను తయారు చేయవచ్చు. ఈవీ, హైడ్రోజన్‌ వాహనాలు తయారూ చేయాలంటే ఇప్పటివరకు వినియోగిస్తున్న వాహనాల్లోని ఇంజన్లలో సమూల మార్పులు చేయకతప్పదు. అది ఎక్కువ పెట్టుబడితో కూడిన వ్యవహారం. కానీ ఇథనాల్‌ మిళిత పెట్రోల్‌ను వాడేందుకు సరికొత్త వాహనాలను తయారు చేయాల్సి ఉంటుంది. సంప్రదాయ ఇంజన్లలో చిన్నపాటి మార్పులు చేస్తే సరిపోతుంది. అందువల్ల తయారీ సంస్థలకు అది పెట్టుబడులు సమస్య కాబోదు. అందువల్ల ఇథనాల్‌తో నడిచే వాహనాల ధరలు మిగతావాటితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. కనుక వినియోగదారులనుంచి ఆదరణ లభిస్తుందన్నది ఓ అంచనా. ఇథనాల్‌ మిళిత పెట్రోల్‌ వల్ల కర్బన ఉద్గారాల విడుదల కూడా చాలా పరిమితంగా ఉంటుంది. అందువల్ల వాతావరణ కాలుష్య భయం ఉండదు. ఇథనాల్‌ ధర మహా అయితే లీటర్‌కు రూ.61 ఉండొచ్చు. ఈ ఇంధనం అందుబాటులోకి వస్తే పెట్రోల్‌ ధరలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇథనాల్‌ అందుబాటులోకి వస్తే పెట్రోలియం దిగుమతులు గణనీయంగా తగ్గించుకోవచ్చు. అలా మిగిలిన నిధులను రైతుల ప్రయోజనాలకు వినియోగించవచ్చు. ఈ నేపథ్యంలో ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ వెహికల్స్‌ (ఎఫ్‌ఎఫ్‌వి), ఫ్లెక్స్‌ ఫ్యూయల్‌ స్ట్రాంగ్‌ హైబ్రిడ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ (ఎఫ్‌ఎఫ్‌వి-ఎస్‌హెచ్‌ఈవీ)ను తయారు చేయాలని వాహన తయారీ సంస్థలను కేంద్రప్రభుత్వం కోరింది.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement