Saturday, May 4, 2024

లాలూకు కాంగ్రెస్ నేత‌ రాహుల్ గాంధీ పరామర్శ

ఢిల్లి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్‌జేడీ చీఫ్‌, బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌ యాదవ్‌ను కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్‌గాంధీ శుక్రవారం పరామర్శించారు. ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ కె.సి.వేణుగోపాల్‌తో కలసి ఆయన ఎయిమ్స్‌కు వచ్చిన రాహుల్‌, క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌లో చికిత్స పొందుతున్న లాలూప్రసాద్‌ యాదవ్‌ను పరామర్శించారు. లాలూ కుటుంబ సభ్యులు, వైద్యులతో మాట్లాడిన రాహుల్‌ లాలూ ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోందని, రెండుమూడు రోజుల్లో జనరల్‌ రూమ్‌కు తరలించే అవకాశం ఉందని వైద్యులు చెప్పారు. కాగా లాలూను కలిసిన రాహుల్‌ కాస్త ఉద్వేగానికి లోనైనారు.

కొద్దిరోజుల క్రితం తన ఇంట్లో మెట్లపైనుంచి జారిపడటంతో లాలూ కుడి భుజం విరిగిపోగా ఛాతీ, వీపుపై తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. దీనికి తోడు మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధితో ఆయన సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలో రెండురోజుల క్రితం ఆయన ఆరోగ్యం విషమించగా బుధవారం రాత్రి ఢిల్లి ఎయిమ్స్‌కు ప్రత్యేక హెలికాప్టర్‌లో తీసుకువచ్చిన విషయం తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement