Wednesday, May 1, 2024

Medical Students: ఉక్రెయిన్‌లో ఆఫ్‌లైన్‌ క్లాసులు.. ఆందోళనలో మెడికల్‌ విద్యార్థులు

రష్యా యుద్ధం కారణంగా ఉక్రెయిన్‌లో వైద్య విద్య చేస్తున్న భారతీయ విద్యార్థులు స్వదేశానికి వచ్చిన విషయం తెలిసిందే. అయితే చాలా వరకు ఆ దేశ వర్సిటీలు సెప్టెంబర్‌ నుంచి ఆఫ్‌లైన్‌ క్లాసులను ప్రారంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ మెడికల్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో కొన్ని వర్సిటీలు సెప్టెంబర్‌ నుంచి క్లాసులు ప్రారంభించనున్నట్లు విద్యార్థులకు వెల్లడించాయి. తప్పనిసరి క్రాక్‌ పరీక్షను అక్టోబర్‌లో ఆఫ్‌లైన్‌ రీతిలో నిర్వహించనున్నారు. మెడిసిన్‌, డెంటల్‌, ఫార్మసీ మూడవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉక్రెయిన్‌ రూల్స్‌ ప్రకారం కచ్చితంగా కేఆర్‌ఓకే-1 పరీక్ష రాయాల్సి ఉంటుంది.

ఆ తర్వాత ఫైనల్‌ ఇయర్‌ పూర్తి అయిన తర్వాత కేఆర్‌ఓకె-2 పరీక్ష రాయాలి. ఆ పరీక్ష పాసైతేనే డాక్టర్‌ లేదా ఫార్మసిస్ట్‌ సర్టిఫికేషన్‌ వస్తుంది. గత ఆరు నెలల నుంచి క్లాసులకు దూరంగా ఉన్న విద్యార్థులకు ఇప్పుడిప్పుడే ఆఫ్‌లైన్‌ క్లాసులకు సంబంధించిన మెసేజ్‌లు అందుతున్నాయి. రక్షణ కల్పిస్తామని వర్సిటీలు చెబుతున్నా.. విద్యార్థులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇండియాకు చెందిన 20 వేల మంది మెడికల్‌ విద్యార్థుల్ని ఉక్రెయిన్‌ నుంచి వెనక్కి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. భారతీయ వర్సిటీల్లో చదువుకునే అవకాశం కల్పించాలని ఆ విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement