Sunday, May 5, 2024

వరి వద్దు… పత్తి బెటర్‌! ప్రత్యామ్నాయ పంటలతో రైతులకు లాభం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: వానాకాలం సాగు సీజన్‌పై సర్కార్‌ దృష్టి సారించింది. ఇప్పటికే ఈ దిశగా వానాకాలపు పంటల సాగు లక్ష్యాలను వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఈ ప్రణాళికకు అనువుగా జిల్లాల వారీగా సాగు కార్యాచరణ మొదలైంది. వివిధ రకాల పంటల సాగు, విస్తీర్ణం, విత్తనాలు తదితర ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. జిల్లా స్థాయి నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు, మందుల వినియోగం, అవసరాలను గుర్తించింది. ప్రధాన పంట వరిని కట్టడి చేసి పత్తి, కంది వంటి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఈ సీజన్‌లో లక్షా 42 వేల ఎకరాల్లో సాగు జరుగుతుందనే అంచనాలుండగా, ఇందులో 70లక్షల ఎకరాల్లో పత్తికి ప్రాధాన్యతనివ్వాలని, 45 లక్షల ఎకరాల్లో వరి, 15లక్షల ఎకరాల్లో కందిపంట దిశగా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. గతేడాది వరి పంట రికార్డుస్థాయిలో 62లక్షల ఎకరాల్లో సాగైంది. దేశంలో ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకుపోవడం, పలు రాష్ట్రాల్లో ఉప్పుడు బియ్యం దిగుమతులు తగ్గడంతో ఎఫ్‌సీఐ దీని సేకరణకు నిరాకరించింది. దీంతో అనివార్యంగా తెలంగాణలో వరిని తగ్గించడం మినహా మార్గం లేకుండా పోయింది. పత్తి ప్రోత్సాహంలో భాగంగా 63వేల క్వింటాళ్ల పత్తి విత్తనాలను సిద్ధం చేస్తోంది. తద్వారా 70లక్షల ఎకరాల్లో పత్తి దిశగా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇక కంది సాగు విస్తీర్ణం 8.57లక్షల ఎకరాలు కాగా, గతేడాది వానాకాలంలో సాధారణంకంటే తక్కువగా 7.56లక్షల ఎకరాల్లో రైతులు కందిని పండించారు. ఈ ఏడాది 15లక్షల ఎకరాలకు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకు 60వేల క్వింటాళ్ల విత్తనాలు సమకూర్చింది. మొక్కజొన్న సాధారణ విస్తీర్ణం 9.90లక్షల ఎకరాల నుంచి 5లక్షల ఎకరాలకే పరిమితం చేసింది. 3.5లక్షల ఎకరాల్లో సోయాబీన్‌, లక్ష ఎకరాల్లో జొన్న, 90వేల ఎకరాల్లో వేరుశనగ, 25వేల ఎకరాలల్లో ఆముదం, 84వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేసేలా యోచిస్తోంది. ఇక ఎరువుల సన్నాహకాలు, సమాయత్తతలో భాగంగా 24.45లక్షల టన్నుల ఎరువులు, 10.50లక్షల టన్నుల యూరియా, 1.30లక్షల టన్నుల డీఏపీ, 9.40లక్షల టన్నుల కాంప్లెక్స్‌, 1.25లక్షల టన్నుల ఎంవోపీ, లక్ష టన్నుల ఎస్‌ఎస్‌పీ సిద్ధం చేసింది.

45లక్షల ఎకరాల్లోపే వరి సాగు…

మరోవైపు రాష్ట్రంలో వరిసాగు ఎక్కువగా సాగు కానుందనే అంచనాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా కూడా కార్యాచరణను మొదలు పెట్టింది. 45లక్షల ఎకరాల్లో వరిపంట సాగును అంచనా వేసుకుంది. ఈ మేరకు రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చర్యలు తీసుకుంటోంది. ఎంటీయూ, బీపీటీ, ఆర్‌ఎన్‌ఆర్‌, వరంగల్‌, జగిత్యాల రకాలకు చెందిన వరి వంగడాలను సిద్ధం చేస్తోంది. వరి విత్తనాలను 25కిలోలకు ఒక ప్యాకెట్‌ చొప్పున రెడీ చేస్తున్నారు. మరో ప్రత్యామ్నాయ పంటగా పేరున్న కందికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది. 15లక్షల ఎకరాల్లో కంది పంట సాగును ప్రోత్సహిస్తోంది.

సేంద్రీయ ఎరువుల వినియోగానికి…

రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించే లక్ష్యంతో ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సేంద్రీయ ఎరువులను ఎక్కువగా వాడేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నది,. జీలుగ, పిల్లిపెసర, జనుము విత్తనాలను సబ్సిడీతో రైతులకు అందిస్తోంది. ఈ సీజన్‌లో 2లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్టె ఎరువును పంపిణీ చేసే లక్ష్యంతో ప్రభుత్వం ఉన్నది.

- Advertisement -

భారీ డిమాండ్‌లో పత్తి…

గత సీజన్‌లో పత్తిసాగు రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపర్చింది. పత్తి ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ఉత్పత్తి ఎక్కువగా రాకపోవడంతో పత్తి రైతులు ఇబ్బందులపాలయ్యారు. ఎకరాకు సగటున 10క్వింటాళ్లు రావాల్సిన పత్తి గడచిన సీజన్‌లో కొన్నిచోట్ల 5 క్వింటాళ్లు కూడా రాలేదని రైతులు చెబుతున్నారు. 2021-22 వానాకాలం సీజన్‌లో రాష్ట్రంలో 36 లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి అయినట్లు మార్కెటింగ్‌ శాఖ వెల్లడించింది. అయితే వర్షాకాలంలో విపరీత వానలు, నేలలు జాలువారడం, పంటలు నీటమునక, గులాబీ పురుగు ప్రభావంతో పత్తి దిగుబడి తగ్గింది. ఈ నేపథ్యంలో డిమాండ్‌ పెరిగి ధర పెరిగింది. కనీస మద్ధతు ధర క్వింటాలుకు రూ.6025 ఉండగా, గరిష్టంగా క్వింటాలుకు రూ.12 వేల ధర పలికింది. 28లక్షల బేళ్ల పత్తిని రాష్ట్రంలోని జిన్నింగ్‌, ప్రెసింగ్‌ మిల్లర్లు కొనుగోలు చేయగా, 8లక్షల బేళ్ల పత్తి మహారాష్ట్ర, గుజరాత్‌, ఏపీకి చెందిన వ్యాపారులు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలో కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రమేయం లేకుండానే అమ్మకాలు పూర్తయ్యాయి. ఈ కారణంగా మరోసారి కూడా పత్తి పంటకు భారీగా లాభాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం చెబుతోంది. అంతర్జాతీయంగా పత్తికి ఉన్న డిమాండ్‌ నేపథ్యంలో పత్తి సాగును ప్రోత్సహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది 70లక్షల ఎకరాల్లో పత్తి పంటను సాగు చేయించే లక్ష్యంతో ప్రభుత్వం కసరత్తు చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement