Sunday, April 28, 2024

National ముగ్గురు పిల్లలుంటే జాబ్​ గోవిందా!.. సుప్రీంకోర్టు తాజా తీర్పు

రాజస్థాన్​లో ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్న వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు. కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో ఈ నిబంధన అమల్లో ఉండగా.. తాజాగా సుప్రీంకోర్టు దీన్ని సమర్థించింది. ఇందులో ఎలాంటి వివక్ష గానీ, రాజ్యాంగ ఉల్లంఘన గానీ లేదని తెలిపింది. ఈమేరకు దీన్ని సవాల్‌ చేస్తూ వేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది.

జాబ్​ దరఖాస్తును తిరస్కరించిన అధికారులు

రాజస్థాన్‌కు చెందిన రామ్‌జీ లాల్‌ జాట్‌ గతంలో సైన్యంలో పనిచేసి 2017లో పదవీ విరమణ పొందారు. అనంతరం కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం 2018లో దరఖాస్తు చేసుకున్నారు. అయితే, రామ్‌జీకి ఇద్దరు కంటే ఎక్కువ సంతానం ఉండటంతో ఆయన దరఖాస్తును అధికారులు తిరస్కరించారు. దీనిపై ఆయన రాజ‌స్థాన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌ను 2022లో రాజస్థాన్‌ హైకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన నిర్ణయమని, ఇందులో తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది.

సుప్రీంలో అభ్యర్థన..

దీంతో ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై తాజాగా విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను సమర్థించింది. ‘‘ఇందులో ఎలాంటి వివక్ష లేదు. కుటుంబ నియంత్రణను ప్రోత్సహించే లక్ష్యంతో తీసుకొచ్చిన ఈ నిబంధన రాజ్యంగ ఉల్లంఘన కిందకు రాదు. గతంలో కొన్ని రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికల కోసం ఈ రూల్‌ తీసుకురాగా మేం దాన్ని ఆమోదించాం’’ అని వెల్లడించింది. ఈ పిటిషన్‌ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది. రాజస్థాన్‌ పోలీస్‌ సబ్‌ఆర్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌, 1989 ప్రకారం.. జూన్‌ 1, 2002 తర్వాత ఇద్దరు, అంతకంటే ఎక్కువ మంది సంతానం కలిగిన అభ్యర్థులు నియామకాలకు అనర్హులు. ఆ తర్వాత రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాలన్నింటికీ ఈ ‘ఇద్దరు పిల్లల’ నిబంధనను అమలుచేస్తూ రాజస్థాన్‌ వేరియస్‌ సర్వీస్‌ రూల్స్‌ చట్టానికి 2001లో సవరణలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement