Monday, April 29, 2024

ధాన్యంపై గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్యమం ఉద్ధృతం : నామా నాగేశ్వరరావు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : పార్ల‌మెంట్ బ‌డ్జెట్ స‌మావేశాల్లో తెలంగాణ రైతుల ధాన్యం సేక‌ర‌ణ అంశంలో కేంద్రం ప్రభుత్వంపై టీఆర్ఎస్ ఎంపీలు యుద్ధం చేశార‌ని టీఆర్ఎస్ లోక్‌స‌భాప‌క్ష నేత, ఖ‌మ్మం ఎంపీ నామ నాగేశ్వరరావు అన్నారు. అన్నదాతలు ఆరుగాలం క‌ష్ట‌ప‌డి పండించిన పంటను కేంద్రం సేక‌రించే వ‌ర‌కు గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉద్య‌మిస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. యాసంగిలో రైతులు పండించిన వడ్లు కొనేవరకు కేంద్రంపై పోరు ఆపేది లేద‌ని ఆయ‌న చెప్పారు. రెండవ విడత బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రతి రోజు పార్లమెంట్‌ లోపల, బయట నిరసనలు తెలపటంతో పాటు ఎన్నోసార్లు స్పీక‌ర్ ఓంబిర్లాకు వాయిదా తీర్మానం నోటీసులు ఇచ్చినా, ఆయన ఏనాడూ తమకు సభలో మాట్లాడే అవకాశమివ్వలేదని నామా ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఆశలతో కష్టపడి పండించిన పంటను కొనకుండా ఎఫ్‌సీఐ రైతుల్ని కష్టాల పాలు చేస్తోందని ఆరోపించారు.

దేశంలో ఆహార ధాన్యాల సేకరణపై కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌మైన జాతీయ విధానాన్ని అవ‌లంభించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌, టీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో ఢిల్లీ నుంచి జిల్లాలు, మండ‌లాలు, గ్రామాలు, గ‌ల్లీల్లోనూ బీజేపీ ప్ర‌భుత్వ రైతు వ్య‌తిరేక విధానాలపై ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తున్నామని నామా నాగేశ్వరరావు వెల్లడించారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రపథంలో దూసుకుపోతుంటే ఓర్వలేక అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిని అడుగడుగునా అడ్డుకుంటున్న కేంద్రానికి రాష్ట్ర ప్రజలు త‌గిన గుణ‌పాఠం చెప్ప‌డం ఖాయమని ఎంపీ జోస్యం చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement