Sunday, May 5, 2024

Delhi | మన్‌కీ బాత్ 100వ ఎపిసోడ్ ప్రత్యేకతలు.. గోల్కొండ కోటలో ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మూడు విశిష్ట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశవ్యాప్తంగా ఆర్ట్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో నిర్వహించే 13 చారిత్రక కట్టడాల్లో గోల్కొండ కోట స్థానం దక్కించుకుంది. న్యూఢిల్లీలోని “ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్”లో సాంస్కృతిక శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించి తమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మూడు విశిష్ట కార్యక్రమాల వివరాలు వెల్లడించారు. 13 ఐకానిక్ ప్రదేశాలలో ఆర్ట్ ప్రొజెక్షన్ మ్యాపింగ్, సౌండ్ & లైటింగ్ షోలు, ఎన్జీఎంఏలో జనశక్తి ఆర్ట్ ఎగ్జిబిషన్, మన్ కీ బాత్ ఇతివృత్తాలపై అమర్ చిత్ర కథా కామిక్స్ విడుదల కార్యక్రమాలు చేపడుతున్నట్టు ఆయన చెప్పారు. అక్టోబర్ 3, 2014లో ప్రారంభమైన  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అంతరంగాన్ని ఆవిష్కరించే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్ ఈనెల 30న ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం కానుంది.

- Advertisement -

మన్ కీ బాత్ కార్యక్రమం ప్రధాని ప్రజలతో నేరుగా సంభాషించే, అసాధారణ వ్యక్తుల విజయాలను వెలికితీయడంలో, ప్రజలకు స్ఫూర్తిదాయకంగా నిలవడంలో ఓ వేదికగా నిలిచిందని గోవింద్ మోహన్ అభిప్రాయపడ్డారు. ఈనెల 29న పురావస్తు శాఖ స్మారక చిహ్నాలతో సహా చారిత్రక ప్రాంతాలైన న్యూఢిల్లీలోని ఎర్రకోట, ప్రధానమంత్రి సంగ్రహాలయ, మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ కోట, ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం, తెలంగాణలోని గోల్కొండ కోట, తమిళనాడులోని వెల్లూరు కోట, మహారాష్ట్రలోని గేట్ వే ఆఫ్ ఇండియా, జార్ఖండ్‌లోని నవరతన్‌గఢ్ ఫోర్ట్, ఉధంపూర్‌లోని రామ్‌నగర్ ప్యాలెస్, ఉత్తరప్రదేశ్‌లోని రెసిడెన్సీ బిల్డింగ్, గుజరాత్‌లోని మోధెరా సూర్య దేవాలయం, అస్సాంలోని రంగ్ గఢ్, రాజస్థాన్‌లోని చిత్తోడ్‌గఢ్ కోటలో అత్యాధునిక ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోల ద్వారా ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తున్నట్టు గోవింద్ మోహన్ చెప్పారు. సాయంత్రం 5 గంటల నుంచి చారిత్రక కట్టడాలలో ప్రాంతీయ భాషలో భారతదేశ చరిత్ర, వారసత్వ కట్టడాల విశిష్టతలను వివరించే ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో అందరినీ ఆకట్టుకుంటుందని ఆయన అభిలషించారు.

ఏక్ భారత్ – శ్రేష్ట్ భారత్ స్ఫూర్తితో ఆయా స్మారక చిహ్నాల చరిత్ర, నిర్మాణ అధ్భుతాలతో పాటు మన్‌కీ బాత్ థీమ్‌ను ఈ ప్రదర్శనలో వివరిస్తారన్నారు. మన్‌కీ బాత్ పాత ఎపిసోడ్‌లు వినడానికి ఆడియో బూత్, సెల్ఫీ బూత్, మెసేజ్ బూత్ వంటి అనేక ఆసక్తికర అంశాలను చారిత్రక కట్టడాల్లో ఏర్పాటు చేస్తున్నామని ఆయన వివరించారు. న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఫర్ మోడ్రన్ ఆర్ట్‌లో మర్నాడు జనశక్తి ఆర్ట్ ఎగ్జిబిషన్ ప్రాంరంభించనున్నట్టు ఆయన తెలిపారు. ఇందులో 12 మంది ప్రఖ్యాత కళాకారుల పెయింటింగ్‌లను ప్రదర్శించనున్నట్లు చెప్పారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, సహాయ మంత్రులు అర్జున్ రామ్ మేఘ్‌వాల్, మీనాక్షి లేఖితో పాటు పలువురు చిత్రకారులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు. నీటి సంరక్షణ, మహిళా సాధికారత, కరోనా మహమ్మారిపై అవగాహన, స్వచ్ఛ భారత్ అభియాన్, పర్యావరణ, వాతావరణ మార్పులు, బారతీయ వ్యవసాయ వ్యవస్థ, యోగా, ఆయుర్వేదం, సైన్స్, క్రీడలు, ఆరోగ్యం వటి 12 విభిన్న థీమ్‌లపై కళాకారుల ప్రదర్శన ఉంటుందన్నారు.

మనదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలు, ఈశాన్య భారత సంస్కృతి సంప్రదాయాలు, వివిధ కళల ప్రదర్శన ఉంటుందని ఆయన వెల్లడించారు. మూడో అంశంలో భాగంగా మన్‌కీ బాత్‌లో మన్‌కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ద్వారా వెలుగులోకి వచ్చిన సామాన్యుల వీరోచిత గాథలు, ఇతివృత్తాలతో అమర్ చిత్ర కథ పేరుతో 12 పుస్తకాల సిరీస్‌ను ఈనెల 30న విడుదల చేస్తున్నట్టు గోవింద్ మోహన్ తెలిపారు. ఇంగ్లిష్‌లో ప్రింటైన ఈ పుస్తకాలను 12 భారతీయ భాషల్లోకి అనువదించనున్నారు. ఇవన్నీ ప్రజలతో సంబంధాలను బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయని గోవింద్ మోహన్ ఆకాంక్షించారు. మన్‌కీ బాత్‌లో ఈ ఆదివారం జాతినుద్దేశించి ప్రధానమంత్రి చేసే ప్రసంగం 22 భారతీయ భాషలు, 29 మాండలికాలు, 11 అంతర్జాతీయ భాషలలో బహుళ వేదికల ద్వారా ప్రసారం కానుందని ఆయన వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement