Tuesday, May 7, 2024

బస్తాకు 4కిలోల తరుగు.. తూకంలోనూ మోసం.. అంతా మిల్లర్ల మాయాజాలం

ప్ర‌భ‌న్యూస్ : ధాన్యం విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాలకు వచ్చిన రైతులకు గుండెకోతే మిగులుతుంది. మరోవైపు ఒక్కో బస్తాకు సరాసరిన 4కేజీలు అదనంగా తూకం వేస్తూ రైతుల కష్టాన్ని తూకం సాక్షిగా కొట్టేస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల అలసత్వం రాజ్యమేలుతోంది. మొన్నటి వరకు వరుణుడు, ఇపుడు అధికారుల రూపంలో రైతులకు పెద్దకష్టమే వచ్చిపడింది. పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేందుకు కేంద్రాలకు తీసుకురాగా తేమ, తాలు పేరుతో వేయాల్సిన దానికంటే అధికంగా తూకం వేస్తున్నారు. కరీంనగర్‌ జిల్లా వంగపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా.. తూకం వేయలేదు. రైతు ప్రశ్నించగా బస్తాకు అదనంగా 4కేజీలకు అవకాశం ఇస్తేనే వేస్తామనడంతో రైతు ససేమిరా అన్నాడు. కానీ చివరకు ఏంచేయాలో తెలియక హమాలీలు అన్న విధంగానే బస్తా తూకం 45కేజీలకు ఒప్పుకున్నాడు. ఇది ఒక్క కరీంనగర్‌లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ఇలాంటి ఘటనలే జరుగుతుండడం గమనార్హం. ఘటనలు జరుగుతున్నా సివిల్‌ సప్తయ్‌ పర్యవేక్షకులు చూసీచూడనట్టు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తేమ, తాలు, కొనుగోళ్లు అన్నీ ఒకవైపైతే.. కొనుగోలు జరిగిన ధాన్యం ఎగుమతి, దిగుమతులకు రైతులే భారం మోయాల్సి వస్తోంది. వాస్తవానికి కొనుగోలు కేంద్రానికి వచ్చిన తరువాత రైతులకు ఎలాంటి ఖర్చులు ఉండవు, కానీ కొనుగోలు జరిగిన ధాన్యం ఎగుమతికి, దిగుమతికి రైతులే డబ్బులు ఇవ్వాల్సి వస్తోంది. గతంలో హమాలీలకు ప్రభుత్వమే చార్జీలను ఇవ్వగా, మూడేళ్లగా చార్జీలను చెల్లించకపోవడంతో హమాలీలు రైతుల వద్దే వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం కొనుగోలు జరిగిన ధాన్యం తూకం, వేసి ఎగుమతి చేసేందుకు క్వింటాకు రూ.45ను హమాలీలు వసూలు చేస్తుండగా, ఎగుమతి అయిన ధాన్యం మిల్లు దగ్గర దిగుమతి కావాలంటే ఒక్కో బస్తాకు రూ.6ను రైతులు చెల్లిస్తున్నారు. మిల్లుల దగ్గర వాహన రద్దీ ఉంటే త్వరగా దిగుమతి చేయాలంటే ఈ ధర పెరిగే అవకాశం కూడా ఉందని రైతు ఒకరు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement