Friday, April 26, 2024

Delhi | వైజాగ్ డ్రగ్స్‌తో ఏపీలో లిక్కర్.. ల్యాబ్ టెస్ట్ చేసి విచారణ జరపాలి : కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశాఖలో వెలుగుచూసిన డ్రగ్స్‌పై తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తయారవుతున్న నాసిరకం మద్యం తయారీలో ఈ డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. ఆ శాంపిళ్లతో పాటు ఏపీలోని మద్యం శాంపిళ్లను కూడా ల్యాబ్ టెస్టుకు పంపించాలని, సమగ్రంగా విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.

విశాఖపట్నంలో ఒక కంటైనర్‌లో లభ్యమైన 25 వేల కేజీల అనుమానిత డ్రగ్స్ విషయంలో ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల వైఖరిపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నివేదికలో ప్రస్తావించడాన్ని ఆయన గుర్తుచేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం పాత్ర లేకుండా రూ. 50 వేల కోట్ల విలువైన డ్రగ్స్ బ్రెజిల్ నుంచి విశాఖపట్నం వరకు ఎలా వస్తాయని ప్రశ్నించారు. కంటైనర్లో వచ్చిన డ్రైఈస్ట్‌లో 6 రకాల మాదకద్రవ్యాలు ఉన్నాయని, రాష్ట్రంలో డ్రగ్స్ విక్రయాలు యదేచ్ఛగా సాగుతున్నాయని ఆరోపించారు.

- Advertisement -

ప్రతి గ్రామంలో గంజాయి విక్రయాలు సాగుతున్నాయని దుయ్యబట్టారు. విశాఖ డ్రగ్స్ వ్యవహారంలో విచారణ ముగియకముందే తెలుగుదేశం నేతల పాత్ర ఉందని ఆరోపణలు చేస్తున్నారని, దీన్ని బట్టే ఎవరి పాత్ర ఉందో అర్థమవుతోందని అన్నారు. ఏపీలో లిక్కర్ బ్యాన్ చేస్తామని చెప్పి మద్యానికి బారులు తెరిచి అమ్ముతున్నారని మండిపడ్డారు. విశాఖ డ్రగ్స్ అంశంలో కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టాలని కనకమేడల కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement